చిక్కడపల్లి :అసంఘటిత కార్మికుల నమోదును వేగవంతంగా పూర్తి చేసి వారికి గుర్తింపు కార్డు అందజేస్తామని తెలంగాణ కార్మిక సామాజిక భద్రతా మండలి చైర్మన్ ఉమ్మన్నగారి దేవేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని తెలంగాణ కార్మిక శాఖ కార్యాలయంలో రాష్ట్రంలోని అసంఘటిత కార్మికులకు గుర్తింపు కార్డుల నమోదు కోసం ప్రత్యేక పోర్టల్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంఘటిత కార్మికులందరిని పోర్టల్లో నమోదు చేసి గుర్తిపు కార్డులు ఇచ్చి వారికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు అమలయ్యేలా కృషి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చిలో కార్మిక సామాజిక భద్రతా మండలి స్థాపించబడిందన్నారు. దేశ వ్యాప్తంగా అసంఘటిత కార్మికుల నమోదుకు ఒక పోర్టల్ను ఈరోజు ప్రారంభించిందని తెలిపారు. దాని ప్రకారం నమోదు ప్రక్రియను రాష్ట్రంలో వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో 90శాతం మంది అసంఘటిత కార్మికులు ఉన్నారని వారందరికీ గుర్తింపు కార్డులు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్డుతో అసంఘటి కార్మికులు ఏ రాష్ట్రం వెళ్లి పనిచేసిన కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్రం అమలు చేస్తున్న కార్మిక పథకాలు పోందుతారని వివరించారు. రాష్ట్రంలో 6500 కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ)ల ద్వారా కార్మికులు తమ సభ్యులుగా నమోదు చేసుకొచ్చన్నారు. దాదాపు 150 కేటగిరీల కార్మికులు ఇందులో నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు రవీంద్రరాజు వర్మ, కె.మనోహర్,జి.వి రావు, ఆర్.వెంకట్రెడ్డి, వివిధ కార్మిక సంఘాల నాయకులు కార్మికులు పాల్గొన్నారు.
.