ఖైరతాబాద్, సెప్టెంబర్ 17 : తెలంగాణ దళిత బంధు ద్వారా ఆ వర్గాలకు ఆర్థిక చేయూతనందించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం గొప్పదని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని దళితుల తరపున కృతజ్ఞతలు తెలుపు తున్నానన్నారు. వారితో పాటు గిరిజనులకు, బీసీల్లోని పేద వర్గాలకు కూడా ఇలాంటి పథకం తీసుకురావాలన్నారు.
స్వాంతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఏ ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదని, అది సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందన్నారు. దళిత బంధును ఎవరూ వ్యతిరేకించినా దళిత ద్రోహులవుతారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన దళిత బంధు పథకాన్ని అభినందిస్తూ అక్టోబర్ 9న ఇందిరాపార్కు వేదికగా కృతజ్ఞత బహిరంగసభ నిర్వహిస్తున్నామని, దళిత ప్రజాప్రతినిధులు హాజవుతున్నారని తెలిపారు.
సైదాబాద్ సింగరేణి కాలనీలో బాలికపై జరిగిన లైంగికదాడి ఘటనలో నిందితుడిని గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందించాల్సిందేనని అన్నారు. ముక్కు పచ్చలారని బాలికకు జరిగిన అన్యాయానికి నిందితుడికి తగిన శిక్ష పడిందన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత వేగంగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ఆ పాప కుటుంబాన్ని కూడా ఆదుకున్నదని అన్నారు.
హిందుత్వమని చెప్పుకొని తిరుగుతున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ తమ పార్టీకి సంబంధించిన కేంద్ర పాలకులు నల్ల రైతు చట్టాలు తీసుకువచ్చినప్పుడు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసినప్పుడు హిందుత్వం గుర్తుకు రాలేదా అని అన్నారు. నేడు తెలంగాణ రైతులు పండించిన పంటను కొనమంటున్నారని, ఇది ఎంత వరకు సమంజసమన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము తిరుపతి తదితరులు పాల్గొన్నారు.