కందుకూరు, ఆగస్టు 5 : గిరిజన తండాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ గిరిజన తండాలపై ప్రత్యేక దృష్టి సారించి అధిక నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. మండల పరిధిలోని సార్లరావుల పల్లి తండ సర్పంచ్ రజిత భర్త ప్రవీణ్ నాయక్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్లు గురువారం ఆమె నివాసంలో కలిసి నూతనంగా గ్రామ పంచాయతీ భవనంతో పాటు తమ తండ పరిధిలోని అనుబంధ తండాలకు నిధులు కేటాయించాలని ఆమెకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గిరిజన తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా గుర్తించి అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గిరిజనులు తమ తండాలను తామే పాలించుకుంటున్నట్లు పేర్కొన్నారు. తండాల అభివృద్ధికి నిధులను మంజూరు చేస్తానని అదే విధంగా నూతనంగా ఏర్పడిన పంచాయతీలకు నూతనంగా పంచాయతీ భవనాలను మంజూరు చేస్తానని తెలిపారు.
సార్లరావులపల్లి, బండమీదితం, గొట్టెలగడ్డ తండ,పొచమ్మగడ్డ తండ,పొతుబండతండ,సీసీ రోడ్డు అండర్డ్రైనేజి పనులకు కోటి 24లక్షల రూపాయలు మంజూరు అయినట్లు తెలిపారు, ఆ పనులకు ఈ నెల 9వ తేదిన శంకుస్థాపన చేస్తానని,ఇంతకు ముందు గ్రామాభివృద్దికి 65లక్షల రూపాయలను మంజూరు చేసినట్లు ఆమె చెప్పారు. అకార్యక్రమంలో మంత్రి కుమారుడు పట్లోల్ల కౌశిక్రెడ్డి.టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు సామ మహేందర్రెడ్డి, కళ్లెం సదానంద్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.