బేగంపేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బేగంపేట్ డివిజన్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి ఇటీవల డివిజన్లోని పాటిగడ్డ, ఓల్డ్ కస్టమ్స్ బస్తీలలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా పాఠశాలల సిబ్బంది తెలిపిన సమస్యలను బుధవారం మారేడ్పల్లిలోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు నివేదిక రూపంలో అందించారు.
దీంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తక్షణమే సమస్యల పరిష్కారానికి, కావలసిన ఏర్పాట్లకు నిధులు మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ పాఠశాలలో నైనా సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించినట్టు కార్పొరేటర్ మహేశ్వరి తెలిపారు.