మియాపూర్: పైవేటు పాఠశాలల యాజమాన్యాల సమస్యలను పరిష్కరించటంలో తాను ఎల్లపుడూ ముందుంటానని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు ఇబ్బందులు ఎదుర్కున్నాయన్నారు. పైవేట్ పాఠశాలలనే నమ్ముకుని పని చేసిన ఉపాధ్యాయులకు తమ ప్రభుత్వం కరోనా భత్యం ఇచ్చి అండగా నిలబడ్డదన్నారు.
శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన పైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్ పరిధిలోని రీటా ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన గురు పూజా మహోత్సవ కార్యక్రమానికి విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థలు తమ ఉనికిని కాపాడుకుంటూనే ప్రస్తుత పరిస్థితులలో సేవా దృక్పథంతో పని చేయాలన్నారు.
పైవేట్ పాఠశాలలు ఎదుర్కునే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని విప్ గాంధీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సంఘం ప్రతినిధులు భీష్మరెడ్డి, శ్రీనివాస్, శంకర్ విజయకుమార్, రావు, పాపిరెడ్డి, ఎస్ఎన్రెడ్డి,రాంచందర్, ఏబీఎన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ గాంధీని సంఘం తరపున ఘనంగా సన్మానించారు.