చాదర్ఘాట్ : మూసీనదికి వరద ఉదృతి భారీగా పెరిగింది. జంట జలశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మూసీనది పరవళ్లు తొక్కుతుంది. దీంతో చాదర్ఘాట్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో స్థానికులను వెంటనే అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ, పోలీసుల్ అధికారులు కమల్నగర్, మూసానగర్, వినాయకవీధి తదితర మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు.
మూసీ వరద ఉదృతి పెరగడంతో చాదర్ఘాట్ కాజ్వే బ్రిడ్జి కి తాకుతూ ప్రవహిస్తుంది. దీంతో పోలీస్ అధికారులు ముందస్తుగా చాదర్ఘాట్ కాజ్వే బ్రిడ్జి పై నుంచి వాహనాల రాకపోకలను నిపిసేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, మూసీ వైపు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సుల్తాన్బజార్ ఏసీపీ దేవేందర్, చాదర్ఘాట్ సీఐ సతీష్ లు మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు.
ఎమ్మెల్యే పర్యటన…
జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో మూసీ నదికి వరద ప్రవాహం పెరగడం వలన పరివాహక ప్రాంతాల్లో నివాస ముండే స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం ఎమ్మెల్యే అహ్మద్ బలాల, సౌత్ జోన్ కమిషనర్ సామ్రాట్ అశోక్, డీసీ రజినీకాంత్రెడ్డి లతో కలిసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. వరద ఉదృతి ని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ముందస్తు చర్యగా స్థానికుల కోసం పునరావాస కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.