ముషీరాబాద్ : ముషీరాబాద్ డివిజన్ ఆదర్శకాలనీ డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ జలమండలి అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికిగాను వెంటనే కొత్త పైపులైన్ ఏర్పాటు పనులు మొదలు పెట్టాలని సూచించారు. గురువారం ఆదర్శకాలనీలో జలమండలి అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే మురుగునీటి లీకేజీ సమస్య తీరును చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోతే ఎలా అని మండిపడ్డారు.
తాగు నీరు, మురుగు నీటి సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆదర్శనగర్లో డ్రైనేజీ సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించడానికి 33 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలో పైపులైన్ ఏర్పాటు పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం సుబ్బారాయుడు, డీజీఎంవాహబ్, మేనేజర్ రమణ, టీఆర్ఎస్ నాయకులు సాంబశివరావు, లక్ష్మణ్ గౌడ్, జీ.రాజు, బిక్షపతి, శివముదిరాజ్, వెంకటేశ్, శ్రీనివాస్, రజినీ, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.