కొండాపూర్ : స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను, నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన మహానుభావులు చూపిన పోరాట పటిమను నేటి యువతకు తెలియజేసేలా చిత్ర ప్రదర్శనలోని చిత్రాలు ఉన్నాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, రీజినల్ ఔట్రీచ్ బ్యూరో సౌత్జోన్ డైరెక్టర్ జనరల్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలలో భాగంగా రీజినల్ ఔట్రీచ్ బ్యూరో (ఆర్ఓబీ) ఆధ్వర్యంలో మాదాపూర్లోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలలో భాగంగా శిల్పారామంలో స్వాతంత్ర సమర యోధులు, హైదరాబాద్ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాట పటిమను సాగించిన ప్రముఖుల చిత్రాలతో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రదర్శన ద్వారా నేటి యువతకు దేశ భక్తి, స్వాతంత్ర సాధనలో సమిధలైన ప్రముఖుల వివరాలను తెలియజేసే అవకాశముంటుందన్నారు. ఈ ప్రధర్శన ఆగస్టు 17వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. చిత్ర ప్రదర్శనకు హాజరయ్యే సందర్శకులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలను పాటించాలన్నారు