కొండాపూర్: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని మాదాపూర్లోని శిల్పారామంలో సోమవారం కృష్ణుడి లీలలు, చిలిపి ఛేష్టలను కళ్ళకు కట్టినట్లు చూపించేలా పలువురు నృత్యకారుల నృత్య ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టు కున్నాయి. నృత్య కిన్నెరా సంస్థ గురువులు మద్దాలి సౌందర్య తమ శిష్య బృందంతో కలిసి ‘పాహిమాం కృష్ణ’ కూచిపూడి నృత్య ప్రదర్శనలతో అలరించారు.
ప్రదర్శనల్లో స్వాగత నృత్యం, వాతాపి గణపతిమ్, జతిస్వరం, నమశివాయతేయ్, చలమేల, చక్కని తల్లికి చాంగుభళా, రామాయణ శబ్ధం, శ్రీకృష్ణ పాటలు తదితర అంశాలను చంద్ర సంహిత, లాస్య, ప్రవర్ధ, శుభగి, మాన్వితలు కూచిపూడి నృత్యరూపకంలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగానిలు ముఖ్య అతిథులుగా హాజరై నృత్యకారులను ప్రత్యేకంగా అభినందించారు.