సైదాబాద్ : కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్ ఆరోగ్య పరిరక్షణ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని జీహెచ్ఎంసీ మలక్పేట సర్కిల్ ఎఎంహెచ్వో డాక్టర్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం మలక్పేట సర్కిల్ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు కిట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడుతూ మలక్పేట సర్కిల్ లోని ఆరు డివిజన్ల పరిధిలో పనిచేసే 865 రెగ్యూలర్, ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు కిట్లను అందజేశామని తెలిపారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్ల కు కూడా కిట్లను అందజేసి, కిట్లల్లో వస్తువులను ఉపయోగించుకునే పద్దతులను వివరించామన్నారు. వైరస్ వ్యాప్తి నివారణతోపాటు, నిత్యం పారిశుద్ధ్య పనుల్లో పాల్గొంటున్న కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన వస్తువులు కిట్లలో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎం మలక్పేట సర్కిల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.