సుల్తాన్బజార్ : దేశంలో మరెక్కడా లేని విధంగా వైద్యరంగానికి పెద్దపీట వేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకే దక్కుతుందని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ వాకాటి కరుణ అన్నారు. గురువారం కోఠిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఉమెన్ కళాశాల ఆవరణలో ధాత్రి మదర్ మిల్క్బ్యాంక్, సుశేన హెల్త్ ఫౌండేషన్, కళాశాల ఫుడ్ అండ్ న్యూట్రీషియన్ విభాగాల సంయుక్తాధ్వర్యంలో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన ధాత్రి మొబైల్ తల్లిపాల నిధి వాహనాన్ని ఆమె ముఖ్య అతిధిగా విచ్చేసి ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ సినీ నటి నభా నటేష్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ తల్లిపాలు నవ జాత శిశువులకు ఎంతో శ్రేయస్కరమన్నారు. 2017లోనే నిలోఫర్ దవాఖానలో ధాత్రి మిల్క్ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగిందని, కేవలం నిలోఫర్లోనే కాకుండా దూర ప్రాంతాల పిల్లలకు తల్లి పాలు అందాలనే ఉద్దేశ్యంతో మొబైల్ తల్లిపాల నిధి వాహనాన్ని తొలిసారి హైదరాబాద్లో ప్రారంభించామన్నారు. సినీనటి నభానటేష్ మాట్లాడుతూ తల్లి పాలే ముద్దని..డబ్బాపాలు వద్దని అన్నారు.
ఈ వాహనంలో పాలను సేకరించే యంత్రాలను, ఫ్రీజర్లను అమర్చడం జరిగిందన్నారు. తల్లి పాల విలువ తెలియ జేసేందుకు ప్రతి ప్రాంతంలో తల్లులకు మదర్కేర్ ప్రక్రియలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ సంస్థ ఎండీ అల్లూరి వెంకట రంగ రాజు, సంస్థ డైరెక్టర్ సుబ్బరాజు, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం విజ్జులత, సుశేన హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ ముర్కి, కార్యదర్శి డాక్టర్ సంతోష్ కుమార్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కవిత,డాక్టర్ ఎం దుర్గా ప్రసాద్,డాక్టర్ భవానితో పాటు ఎన్సీసీ విద్యార్థినీలు పాల్గొన్నారు.