మన్సూరాబాద్ : మన్సూరాబాద్ పెద్దచెరువు, నాగోల్ చెరువులను సోమవారం సాయంత్రం రాచకొండ పోలీస్ కమీషనరేట్ సీపీ మహేష్భగవత్ సందర్శించి గణేష్ నిమజ్జనాల ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనాల సందర్భంగా తీసుకోవల్సిన జాగ్రత్తలపై పోలీసు సిబ్బందితో పాటు జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులకు సూచనలు చేశారు. నిమజ్జనాల కోసం ఏర్పాటు చేసిన కొలను చుట్టూ ఆయన కలియతిరుగుతూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. భారీ విగ్రహాల నిమజ్జనాల సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలను కొలనులలోకి అనుమతించకుండా జీహెచ్ఎంసీ సిబ్బంది సహకారంతో నిమజ్జనాలను నిర్వహించాలని సూచించారు.
క్రేన్లలోకి ఇతర వ్యక్తులను అనుమతించవద్దని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ప్రమాదాలకు తావు లేకుండా నిమజ్జనాలను కొనసాగించాలని సీపీ మహేష్భగవత్ రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బందికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఎల్బీనగర్ సీఐ అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.