బంజారాహిల్స్ : ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంలో భాగంగా బస్తీ కమిటీల ఏర్పాటు పూర్తయిందని ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు. మంగళవారం నూతన బస్తీ కమిటీలకు చెందిన జాబితాలను టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కమిటీల ఏర్పాటు ఇన్చార్జి బండి రమేష్కు ఎమ్మెల్యే దానం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో బస్తీ కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేశామని, మరో వారంరోజుల్లో డివిజన్ కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తామన్నారు.
కొత్తగా బస్తీ కమిటీల్లో చోటు సంపాదించుకున్న నాయకులంతా పార్టీ పటిష్టతకు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారం బాధ్యత తనదే అన్నారు. బస్తీ కమిటీలు ప్రతి నెలా సమావేశం కావాలని, ఆ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించడంతో పాటు పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.