అంబర్పేట : జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఇంకా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని చెప్పారు. బుధవారం జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఐదు డివిజన్లు కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట డివిజన్లలో జీహెచ్ఎంసీ, జలమండలికి సంబంధించిన ఎన్ని అభివృద్ధి పనులు మంజూరయ్యాయి? ఎన్ని పురోగతిలో ఉన్నాయి? ఎన్ని పూర్తయ్యాయి? అనే విషయమై సమీక్షించారు. పురోగతిలో ఉన్న పనుల్లో వేగం పెంచాలని పేర్కొ న్నారు. నిధులు మంజూరై ఇంకా ప్రారంభించని పనులను వెంటనే ప్రారంభించాలని తెలిపారు.
ఇప్పటివరకు వరుస పండుగలు, సెలవుల దృష్ట్యా పనులు నత్తనడకన సాగాయని, ఇక వాటి వేగం పెంచాలన్నారు. అదే విధంగా కొత్త రోడ్డు వేయకముందే జలమండలికి సంబంధించిన డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్ పనులు వేయాలని చెప్పారు. కొత్త రోడ్డు వేసిన తరువాత దాన్ని తవ్వుతామంటే ఒప్పుకునేది లేదన్నారు. ఒకరికొకరు సమన్వయం చేసుకొని పనులు చేపట్టాలని సూచించారు.