బంజారాహిల్స్ : జీహెచ్ఎంసీకి చెల్లించే ఆస్తిపన్నును సక్రమంగా వసూలు చేయకపోవడంతో పాటు సరైన విధానంలో మదింపు చేయడం లేదనే ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి. కొన్ని ప్రాంతాల్లో రెసిడెన్షియల్ భవనాలుగా ఆస్తిపన్ను రికార్డుల్లో నమోదయిన భవనాల్లో వాణిజ్య కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. అయితే సదరు యజమాని రెసిడెన్షియల్ కేటగిరిలోనే ఆస్తిపన్ను చెల్లిస్తుంటారు. దీంతో పాటు అసెస్మెంట్ సమయంలో కింది స్థాయి సిబ్బంది అవకతవకలకు పాల్పడుతుంటారు. ఇలాంటి లోపాలను సరిదిద్దడంతో పాటు ఆస్తిపన్ను వసూళ్లను పెంచుకునేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రాపర్టీ టాక్స్ అసెస్మెంట్ స్సెషల్ డ్రైవ్ ప్రారంభమయింది.
జీహెచ్ఎంసీ పరిధి ఖైరతాబాద్ జోన్లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, ఖైరతాబాద్, షేక్పేట, హిమాయత్నగర్ పరిధిలోకి వచ్చే అన్ని వాణిజ్య ప్రాంతాల్లో ఆస్తిపన్ను పీటీఐ నెంబర్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆస్తిపన్ను చెల్లిస్తున్న వారితో పాటు నివాస ప్రాంతాల కేటగిరిలో ఆస్తిపన్ను చెల్లిస్తూ వాణిజ్య కార్యకలాపాలు చేస్తున్న వారి వివరాలను సేకరించడంతో పాటు వారికే యాప్ ద్వారా సెల్ఫ్ అసెస్మెంట్ అవకాశం కల్పిస్తున్నారు. దీనికోసం 5రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు.
ప్రత్యేక బృందాలతో సర్వే..
ప్రాపర్టీ టాక్స్ అసెస్మెంట్ సర్వే నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. డివిజన్ వారీగా ఏర్పాటు చేసిన ఈ బృందాల్లో జీహెచ్ఎంసీకి చెందిన టాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లతో పాటు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(ఎన్ఏసీ) ద్వారా ఎంపికైన ఇంజనీర్లు సభ్యులుగా ఉన్నారు. వాణిజ్య ప్రాంతాల్లోని భవనాల ఆస్తిపన్ను లెక్కింపు ద్వారా ఎగవేతదారులను గుర్తించడంతో పాటు అదనపు ఆదాయం పెంచుకోవాలన్న లక్ష్యంతో ఈ క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తున్నాయి.
ఆయా భవనాల వాస్తవ విస్తీర్ణం ఎంత? ప్రస్తుతం ఎంత విస్తీర్ణానికి టాక్స్ చెల్లిస్తున్నారు, ఒకవేళ మదింపులో చూపిన దానికంటే ఎక్కువగా ఏమైనా వాణిజ్య కేటగిరిలో వినియోగిస్తున్నారా అనే విషయాలను పరిశీలిస్తున్నారు.. దీంతో పాటు సదరు భవనానికి నిర్మాణ అనుమతి ఉందా..ఉంటే ఎన్ని అంతస్తులకు ఉంది..ఎన్ని అంతస్తులు నిర్మించారు. భవనం మొత్తం విస్తీర్ణమెంత..ఎంత విస్తీర్ణానికి పన్ను చెల్లిస్తున్నారనే అంశాలను కూడా సర్వేలో భాగంగా పరిశీలిస్తారు. ఎక్కడైనా అనుమానాలు వస్తే అప్పటికప్పుడే భవనానికి సంబంధించి కొలతలు కూడా తీసుకుంటున్నారు.