ఆర్కేపురం : తెలంగాణ రాష్ట్రంలో చెరువులు, కుంటలు నిండి ఉభయ గోదావరి లా తలపిస్తోందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షునిగా నియమించబడిన పెండ్యాల నగేష్కు బుధవారం కాలనీ వాసులు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిత్రలేఅవుట్ కాలనీ ఆర్కేపురం డివిజన్లోనే ఓ ప్రత్యేకమైందని తెలిపారు.
తాను కూడా చిత్రలేఅవుట్ బిడ్డనేనని తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచారని పేర్కొన్నారు. ఇండ్రస్ర్టీలు ఏ రాష్ట్రంలో పెట్టని పెట్టుబడి తెలంగాణలో పెడుతున్నా యని చెప్పారు. అధ్యక్షుడిగా ఎన్నికైన నగేష్ నిజాయితీ, నిబద్దతతో ఉండాలని సూచించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. డివిజన్ పరిధిలో ఎక్కడ సమస్య ఉంటే తన సమస్యగా భావించి ప్రజలకు, తనకు మధ్య వారధిగా పని చేయాలని అన్నారు. అందరినీ కలుపుకొని డివిజన్ అభివృధ్ధే ద్యేయంగా ముందుకెళ్లాలన్నారు.