మియాపూర్ : ఉన్నత విలువలు ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన నేత చేకూరీ కాశయ్య అకాల మరణం తనను ఎంతో కలచివేసిందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఖమ్మం పట్టణంలో కమ్మవారి కల్యాణ మంటపంలో శనివారం జరిగిన మాజీ శాసన సభ్యులు, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ ఛైర్మన్ , తెలంగాణ అభ్యుదయ వాది చేకూరీ కాశయ్య కాంస్య విగ్రహావిష్కరణ, పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ తనకు అత్యంత ఆప్త స్నేహితుడని ఆయనతో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసు కున్నారు. రాష్ట్ర రాజకీయాలలో ఆయన జీవితం ఎంతో మంది నేతలకు ఆదర్శమని విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపి నామా నాగేశ్వర్రావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, విత్తనాభివృద్ది సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వర్రావు, ఖమ్మం మేయర్ నీరజ సహా ఇతర ప్రముఖులతో పాటు మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ , సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.