ఎర్రగడ్డ : కాలనీలకు దీటుగా బస్తీలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించటానికి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బోరబండ డివిజన్లో కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి ఆయన ఆదివారం రూ.65 లక్షలు విలువైన సివరేజీ, తాగునీటి పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ 6 ఏండ్ల క్రితం వరకు అభివృద్ధికి నోచుకోని బోరబండ నేడు సంపూర్ణ అభివృద్ధితో బంగారుబండగా రూపు దిద్దుకున్నదని పేర్కొన్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకువచ్చి బాబా ఫసియుద్దీన్ చురుకైన పాత్ర పోషిస్తున్నాడని కితాబిచ్చారు.
డివిజన్లో తిష్ట వేసిన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించటానికి ఆయా శాఖల అధికారులతో మాట్లాడి అవసరమైన నిధులను మంజూరు చేయించానని వివరించారు. బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ బోరబండలో పుట్టి పెరిగిన తనకు ప్రతి గల్లీ గురించి అవగాహన ఉన్నదని.. ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే గోపీనాథ్ సహకారం ఎంతో ఉన్నదన్నారు.
డివిజన్లోని రాజ్నగర్, వినాయకరావునగర్, భారత్నగర్, స్వరాజ్నగర్, ఇందిరానగర్ బస్తీల్లో పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఎమ్మెల్యే, కార్పొరేటర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రహ్మత్నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, ప్రధాన అనుబంధ కమిటీలకు చెందిన నేతలు ఎన్.విజయకుమార్, భూపతిరెడ్డి, వెంకటేష్, రమేష్యాదవ్, లక్ష్మణ్గౌడ్, ఆనంద్, లడ్డు, శంకర్, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.