ముషీరాబాద్ :మానస ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో బహుభాషా కవి సమ్మేళనం, వివిధ రంగాల ప్రముఖులకు కళామానస పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. సోమవారం గానసభ కళాసుబ్బారావు కళావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో అఖిల భారత భాషాసాహిత్య సమ్మేళన్ అధ్యక్షుడు ఆచార్య కడారు సత్యమూర్తి ముఖ్య అతిధిగా పాల్గొని వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న వారికి కళామానస పురస్కారాల ప్రదానం చేశారు.
బహుభాషా కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులను సత్కరించారు. జీవిఆర్ కల్చరల్ ఫౌండేషన్ అధ్యక్షుడు గుదిబండి వెంకటరెడ్డి, కవి గట్టుపల్లి సీతారామరావు, డాక్టర్ నర్మదారెడ్డిలు కళామానస పురస్కారాలను అందుకున్నారు. సాహితీవేత్త డాక్టర్ వోలేటి పార్వతీశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్థనమూర్తి, కెనరా బ్యాంక్ విశ్రాంత ఎజిఎం ఐవి.రావు, మానస ఆర్ట్స్ సంస్థ అధ్యక్షుడు బి.రామచందర్రావు, ఉపాధ్యక్షుడు లలితవాణి, కార్యదర్శి రఘుశ్రీ తదితరులు పాల్గొన్నారు.