మాదాపూర్ :కరోనా ఉదృతి అంతకంతకు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గతేడాది పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. దీంతో పాఠశాల యాజమాన్యాలు, ప్రభుత్వ పాఠశాలల ఉపాద్యాయులు ఆన్లైన్ (పరోక్ష) తరగతులను నిర్వహించడంతో విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలతోనే విద్యా బోధన కొనసాగింది.
ఈ నేపథ్యంలో తాజాగా ప్రత్యక్ష (ఆఫ్లైన్) విద్యా బోధనకు ఆదేశాలు ఇస్తు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వం తల్లిదండ్రుల ఇష్టానుసారంగా విద్యార్థులను ప్రత్యక్ష లేదా పరోక్ష తరగతులకు హజరుకావచ్చని ఇందులో ఎటువంటి ఒత్తిడి ఉండబోదని తేల్చిచెప్పింది. ఇందులో భాగంగా మొదటి రోజు మాదాపూర్లోని ఫలు పాఠశాలల్లొ ఒక్కో తరగతి గదిలో కేవలం 10 నుండి 12 మంది విద్యార్థులు మాత్రమే హజరయ్యారు.
మాదాపూర్లోని స్వాతి హై స్కూల్లో పరోక్ష (ఆన్లైన్) తరగతులకు 22 శాతం మంది విద్యార్థులు హజరుకాగా ఆఫ్లైన్ (ప్రత్యక్ష) తరగతులకు 8 శాతం మంది విద్యార్థులు హజరయ్యారు. మాదాపూర్లోని ఎస్ఆర్ డిజి స్కూల్లో ప్రత్యక్ష, పరోక్ష తరగతులు కలిపి మొత్తం 60 శాతం మంది విద్యార్థులు కాగా అందులో 54 శాతం మంది విద్యార్థులు పరోక్ష తరగతులకు పరిమితం కాగా కేవలం 6 శాతం మంది విద్యార్థులు ప్రత్యక్ష బోధన తరగతులకు హజరయ్యారు.
ఖానామెట్, చందానాయక్ తండాలోని ప్రభుత్వ పాఠశాలలో అన్ని తరగతి గదుల్లో కలిపి కేవలం 10 నుండి 15 మంది విద్యార్థులు మాత్రమే హజరయ్యారు. మెరిడియన్ పాఠశాలలో 23 శాతం మంది విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు హజరుకాగా 8 శాతం మంది విద్యార్థులు ఆఫ్లైన్ తరగతులకు హజరయ్యారు.