కందుకూరు : ఈ వానకాలం సీజన్లో రైతులు పొలాల్లో సాగు చేసుకున్న పంటల వివరాలను వ్యవసాయ అధికారులు సేకరిస్తున్నారు. గ్రామాల వారీగా వరిసాగు విస్త్రీర్ణం. ఏ మేరకు చేపట్టారన్న విషయమై క్షేత్రస్థాయిలో రైతుల నుంచి వ్యవసాయ శాఖ సిబ్బంది క్లస్టరు వారీగా పర్యటిస్తూ వివరాలను నమోదు చేస్తున్నారు. రైతుబంధు సమితి సభ్యులు సైతం ఈ సర్వేలో భాగస్వామలు అవుతున్నారు. ఈ వానకాలంలో వర్షాలు విస్తారంగా కురియడంతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి.వరి సాగు విస్తీర్ణానానికి సంబంధించి పక్కా సమాచారం రాబట్టే పనిలో వ్యవసాయ అధికారులు నిమగ్నమయ్యారు.
డివిజన్ పరిధిలోని మహేశ్వరం, కందుకూరు, కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి వ్యవసాయ అధికారులు పంటల వివరాలను సేకరిస్తున్నారు. కందుకూరు, ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, తదితర మండలాల్లో వరిసాగు ఈ సంవత్సరం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. పెరుగుతున్న సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు, విత్తనాలు క్రిమిసంహరక మందులు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీగా ప్రత్యేక ఫార్మాట్లో వివరాలను నమోదు చేసి పంటల ఉత్పత్తులను బట్టి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకు వ్యవసాయ శాఖ గ్రామాల వారీగా వివరాలను సేకరిస్తున్నది.
పక్కాగా పంటల లెక్క…
వానకాలంలో రైతులు సాగుచేసిన పంటల వివరాలను సర్వే నంబర్ల వారీగా వ్యవసాయ శాఖ సిబ్బంది రైతు బంధు సమితి సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా పూర్తిస్థాయి సమాచారం అందుబాటులోకి వస్తుంది. వ్యవసాయపొలాల వద్దకు వచ్చే వ్యవసాయ అధికారులకు రైతులు సహకరించి పంటల వివరాలను తెలియజేయాలి
–సుజాత ఏడీఏ వ్యవసాయ శాఖ