చాదర్ఘాట్ : టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. పాతనగరం నుంచి పార్టీ కోసం శ్రమించిన నేతలకు నామినేటెడ్ పదవుల్లో తప్పకుండా చోటు దక్కుతుందని… ఇదే విషయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారని ఆయన పేర్కొన్నారు. గురువారం మలక్పేట నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఆజంపురాలోని ఆజం ఫంక్షన్ హాల్లో నియోజకవర్గం ఇన్ఛార్జీ ఆజం అలీ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ బస్తీ, డివిజన్ కమిటీ ఎన్నికలు అందరి సహకారంతో ఏకగ్రీవంగా పూర్తి చేయాలని సూచించారు. పార్టీ కోసం శ్రమించే నేతలకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని తెలియజేశారు. రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా జరగడం లేదని అన్నారు. రాష్ట్ర పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని, నంబర్ వన్ సీఎంగా గుర్తింపు పొందారన్నారు.
డివిజన్ ఎన్నికల కమిటీ పరిశీలకులుగా పార్టీ నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శులు బండి రమేశ్, సి.నరేంధ్రనాథ్లు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్చార్జీ ఆజం అలీ, పార్లమెంట్ ఇన్ఛార్జీ శ్రీకాంత్, హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రాధ, వైస్ చైర్మన్ కొరుడు భూమేశ్, మాజీ కార్పొరేటర్లు తీగల సునరితారెడ్డి, సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.