సికింద్రాబాద్ : అత్యంత వెనుక బడిన కులంలో జన్మించిన ఐలమ్మ తెలంగాణ బహుజన వర్గాల స్పూర్తి ప్రదాతగా నిలిచిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సాయుధ పోరాట కాలంలోనే తన హక్కుల సాధన కోసం కొట్లాడిన గొప్ప ప్రజాస్వామికవాది వీరవనిత ఐలమ్మ అన్నారు. ఈ మేరకు ఆదివారం కంటోన్మెంట్ మడ్ ఫోర్ట్ దోభీఘాట్ లో చాకలి ఐలమ్మ 126వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుక ల్లో మంత్రులు శ్రీనివాస్ గౌడ్ , చామకూర మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు.
అనంతరం ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఐలమ్మ ప్రజాస్వామిక పోరాట స్పూర్తి ఇమిడి ఉందన్నారు. అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మించుకుందామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఐలమ్మ జయంతి, వర్థంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని, రజకుల కోసం ఎంబీసీ కార్పోరేషన్ ఏర్పాటు చేశామని అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వం ఆశయ మన్నారు. గతంలో మాదిరిగా కాకుండా రజకులు ఆర్థికంగా ఎదిగేలా డ్రైక్లీనింగ్ , డ్రైయర్స్ లాంటివి చేసుకోవాలన్నారు.
మడ్ ఫోర్ట్ లో మోడల్ ధోభీఘాట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, తన నియోజకవర్గంలో కూడా త్వరలోనే దోభీఘాట్ ఏర్పాటుతో పాటు ఆధునాతన యంత్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ ఉక్కు మహిళగా చరితలో నిలిచిందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఏ కులం అయినా పేదలకు అండగా నిలవడమే గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలోని కుల వృత్తుల వారికి పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా చాకలి ఐలమ్మ నిలిచిందన్నారు.
ఐలమ్మ స్ఫూర్తితోనే స్వరాష్ట్ర స్వప్నం సాకారం : మంత్రి మల్లారెడ్డి
చాకలి ఐలమ్మ స్ఫూర్తి ని పుణికి పుచ్చుకుని తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నామని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం మనందరికి గర్వ కారణ మన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు తెలంగాణ మహనీయులను గౌరవించలేదని, కనీస గుర్తింపు కూడా ఇవ్వకుండా వివక్ష చూపాయని మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంత మహనీయులైన దాశరథి, కాళోజీ, నవాబ్ జంగ్ జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రం సాధించుకున్నామని చెప్పారు. తెలంగాణ పోరాటయోధులను గౌరవించుకునే సంస్కృతి, సంప్రదాయం మనదన్నారు.
మహిళా చైతన్యానికి ప్రతీక ఐలమ్మ : మంత్రి తలసాని
పోరాట స్ఫూర్తిని చాటిన వీర వనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య , పాడి పరిశ్రమ ల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా, అనేక భూ పోరాటాలు, పేద ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన ధీర వనిత ఐలమ్మ అన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవం, మహిళా చైతన్యానికి ఆమె ప్రతీకగా నిలిచిందన్నారు. ఆమె ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ ఐలమ్మ జయంతి, వర్ధంతి ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం పోరాట యోధులను ఎప్పుడూ గౌరవిస్తుందని పేర్కొన్నారు. ఐలమ్మ పోరాటాలకు గుర్తుగా, భవిష్యత్ తరాలకు ఆమె చరిత్రను తెలియజేసే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. హైదరాబాద్ లో 3 ఎకరాల విస్తీర్ణంలో రూ. 5 కోట్ల ఖర్చుతో స్మారక భవనం నిర్మిస్తుందని, 5వ తరగతిలో ఐలమ్మ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చి ఆమెకు సముచిత గుర్తింపు, గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని చెప్పారు.
కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, బీసీ రజక ఫెడరేషన్ ఎండీ చంద్రశేఖర్ , టీఆర్ ఎస్ సీనియర్ నాయకులు గజ్జెల నాగేశ్ తో పాటు రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల ఉప్పలయ్య, రజక సంఘం యూత్ అధ్యక్షుడు నల్ల తీగల రాజు, కో-కన్వీనర్ కోట్ల శ్రీనివాస్, మడ్ ఫోర్ట్ రజక సంఘం ప్రతినిధులు శంకర్ , పరుశరామ్ తదితరులు పాల్గొన్నారు.