ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) టవర్కు తొలి అడుగు పడింది. మావల మండలంలోని బట్టి సవర్గాం వద్ద మూడెకరాల స్థలం కేటాయించారు. ఇటీవలే కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. గత నెలలో జిల్లాలో పర్యటించిన ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హామీ మేరకు భూమి కేటాయించారు. ఇందులో భాగంగా అధికారులతో కలిసి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ టవర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో టవర్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ కృషి వల్ల ఉన్నత చదువులు చదువుకున్న యువతకు స్థానికంగా ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లాగా ఉండేది. గత పాలకులు జిల్లాను విస్మరించడంతో అభివృద్ధికి నోచుకోలేదు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఉపాధిని మెరుగుపర్చడమే కాకుండా సౌకర్యాలను కల్పిస్తున్నాయి. పరిశ్రమల స్థాపనకు రాయితీలను సర్కారు కల్పిస్తున్నది. గతంలో హైదరాబాద్, బెంగళూరు, పుణె వంటి పట్టణాలకు పరిమితమైన ఐటీ పరిశ్రమలు.. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో సర్కారు ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్ పట్టణంలో బీడీఎన్టీ ల్యాబ్ ఐటీ కంపెనీ ఉండగా.. ఇందులో 120 మంది యువత పనిచేస్తున్నారు. పలు దేశాలకు చెందిన కంపెనీలతో కలిసి జిల్లావాసులు విధులు నిర్వహిస్తున్నారు. స్థానికులు కూడా దేశ, విదేశాల్లోని వివిధ ఐటీ కంపెనీలు నడిపిస్తున్నారు. ఐటీ రంగాన్ని విస్తరించడంలో భాగంగా ఆదిలాబాద్లోనూ ఐటీ పార్కు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ను స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న కోరారు.
సెప్టెంబర్ 26వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బీడీఎన్టీ నిర్వాహకులు, ఉద్యోగాలతో మాట్లాడారు. వారు విదేశీ కంపెనీలతో కలిసి పనిచేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. వారి సమస్యలను తెలుసుకున్న మంత్రి కేటీఆర్ విద్యుత్, ఇతర అవసరాలకు రూ.1.50 కోట్లు విడుదల చేశారు. ఉద్యోగుల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ ఆదిలాబాద్లో ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ఐటీ శాఖ అధికారులు ఇటీవల జిల్లాలో పర్యటించి టవర్ ఏర్పాట్లపై సమీక్షించారు. ఐటీ టవర్ ఏర్పాటుకు మూడెకరాల స్థలం కేటాయించాలని కలెక్టర్ను కోరారు. ఈ మేరకు మావల మండలం బట్టి సవర్గాంలోని సర్వే నంబరు 72లో కేటాయిస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐటీ టవర్కు మంజూరు చేసిన భూమిని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం జిల్లాలో ఐటీ పార్కు ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ కృషి వల్ల ఉన్నత చదువులు చదువుకున్న తమకు స్థానికంగా ఉద్యోగాలు లభిస్తాయని యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఉపాధి మెరుగుపడింది. ఆదిలాబాద్లో ఐటీ రంగం విస్తరించడం అభినందనీయం. ముఖ్యమంత్రి కేసీఆర్, ముంత్రి కేటీఆర్ కృషి వల్ల ఐటీ కంపెనీ ఏర్పాటు కావడంతోపాటు ఐటీ పార్కు ప్రారంభంకానుంది. ఐటీ టవర్ ఏర్పాటుతో నిరుద్యోగులు, యువతకు ఉద్యోగాలు లభించడంతోపాటు స్థానికంగా పనిచేసే అవకాశం లభిస్తుంది.
– జోగు ప్రేమేందర్, మున్సిపల్ చైర్మన్, ఆదిలాబాద్