దీపం పరబ్రహ్మ స్వరూపం.. జ్ఞానానికి చిహ్నం.. ఏ శుభ కార్యం మొదలు పెట్టినా ముందుగా జ్యోతిని వెలిగించి ప్రారంభించే సంప్రదాయం మనది. దీపాంతల్లో పోసే నెయ్యి, నూనె, వత్తి మనలోని కోరికలు, అహంభావ ధోరణులకు సంకేతం. భగవంతుడి ముందు వెలిగించగానే మనలోని కోరికలు నెమ్మదిగా ఆవిరవుతూ అహం కాలిపోతూ ఉంటుందని ప్రతీతి. కృష్ణ పక్షంలో వచ్చే దీపావళి పండుగ దీపాల ప్రాశస్త్యం కలిగి ఉంది. పూర్తి జాగ్రత్తలు పాటించి ఇంట్లోని ప్రతి ఒక్కరూ పండుగను జరుపుకుంటే ప్రతి ఇంట్లో వెలుగుల దీపాలే.
– నిర్మల్ అర్బన్, అక్టోబర్ 22
ప్రతి ఒక్కరూ ఆనందంగా గడిపే పండుగ దీపావళి. దీనికి ముందుగా గుర్తొచ్చేవి పటాకులు. వా టిని జాగ్రత్తగా కాల్చితే ఆనందం వెల్లివిరుస్తుంది. అదే కాస్త అజాగ్రత్త పాటిస్తే ప్రమాదం వెంట వస్తుంది. ‘చీకటి వెలుగుల రంగేళి.. జీవితమే దీపావళి’ అంటూ జీవితాన్ని దీపావళితో అన్వయించాడు ఓ సినీ గేయ రచయిత. జీవితంలో కష్టసుఖాలున్నట్లే వెలుగుపూలు పంచిపెట్టే ఈ పండుగ సైతం ప్రమాదాన్ని తెచ్చి పెడుతుంది. నూతన వస్ర్తాల ధారణ, లక్ష్మీపూజ, పిండి వంటకాల రుచులతో ప్రతి ఒక్కరూ ఆనందంగా పటాకులు కాల్చడం ఆనవాయితీ. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం బారినపడతారు. అలాంటి ఘటనలు యేటా ఎన్నో సంభవిస్తున్నాయి. అ లాంటి వాటితో కొంచెం జాగ్రత్తగా ఉంటే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిర్మల్ జిల్లాలో సోమవారం దీపావళిని ఘనంగా నిర్వహించుకోనున్నారు. ఈ నేపథ్యం లో ఇప్పటికే పట్టణంలో పటాకుల దుకాణాలు వెలిశాయి.
వయసును బట్టి పటాకులు కాల్చితే చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చు. 3 నుంచి 5 ఏండ్ల వయసు వరకు పిల్లలు రంగుల అగ్గి పుల్ల లు, పెన్సిళ్లు, తాళ్లను కాల్చడం మంచిది. 5 నుంచి 12 ఏళ్ల వారు బర్డ్స్, లక్ష్మి, బుల్లెట్ బాంబులు కాల్చాలి. 21 ఏండ్ల తర్వాత వారు చిచ్చు బుడ్లు, రంగుల ఫౌంటేన్లు, క్రాకర్ కింగ్స్, రాకెట్లు, లక్ష్మీ బాంబులు, రెడ్ ఫోర్స్ బాంబులు, డబుల్ బాంబులు, యువతులు, మహిళలు సింగిల్ సెల్స్, క్లాసిక్, సిల్వర్ షవర్స్, స్టార్ వాల్, మూన్లైట్, రంగ్మేళా తదితర పటాకులు కాల్చితే మంచిది. కాగా, పటాకులు నాణ్యమైనవి కొనుగోలు చేస్తే మంచిది.
పటాకుల దుకాణాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. ఫైర్ సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలి. డ్రమ్ముల్లో నీళ్లు, బకెట్లలో ఇసుక, ఫైర్ సేఫ్టీ సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలి. విక్రయాలు చేపట్టే ప్రదేశంలో ఒక దుకాణం నుంచి మరొక దుకాణానికి రెండు మీటర్ల దూరంలో పటాకులు విక్రయించాలి. సాధ్యమైనంత వరకు ఖాళీ ప్రదేశాల్లో పటాకులు కాల్చాలి. పిల్లల చేతికి భారీ పేలుడు రకాలు ఇవ్వవద్దు. కాకరవత్తులు, విష్ణు చక్రాలు, భూ చక్రాలు కాల్చిన తర్వాత వాటి కడ్డీలను ఎక్కడ పడితే అక్కడ వేయరాదు. వత్తులు ఆరిపోయిన పటాకుల దగ్గరకు వెళ్లవద్దు.. ఒక్కోసారి అవి పేలే ప్రమాదం ఉంది. పిల్లలు పటాకులు కాల్చే సమయంలో వారిని కచ్చితంగా గమనించాలి. ఎలా కాల్చాలో ముందుగానే పిల్లలకు వివరించాలి.
పటాకులు, రాకెట్లు కాల్చేటప్పుడు కంటికి వీలైనంత దూరంగా ఉంచాలి. నిప్పురవ్వలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. అవి కంట్లో పడితే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి కంటినే తీసివేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. పటాకులు కాల్చేటప్పుడు కంటికి నల్లని ప్లాస్టిక్ అద్దాలను ధరించితే మంచిది. ప్రమాదం జరిగితే వెంటనే కళ్లను చల్లటి నీటితో కడుక్కొని కంటి వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి.
– యు.కృష్ణంరాజు, ప్రముఖ కంటి వైద్యుడు
జిల్లాలో ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించాలి. ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాలి. ప్రాణనష్టం జరిగితే వెంటనే 108కు సైతం సమాచారమివ్వా లి. నిర్మల్ జిల్లా కేంద్రం వారు 08734-242101, 90103 65407, భైంసా 08751-231101 ఫోన్ నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు.
– జయంత్రావ్, ఫైర్ అధికారి