కందుకూరు : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరిసేలా భక్తిభావంతో వినాయక నవరాత్రులను నిర్వహించిన మండలంలోని దాసర్లపల్లి వినాయక మండపం లక్ష రూపాయల నగదును గెలుచుకుంది. అదికూడ సామాజిక సేవకుడైన ముస్లిం వ్యక్తి ఎండీ ఆసీఫ్ అలీ ఈ నగదును అందించి మతసామరస్యాన్ని చాటి చెప్పాడు. కాగా ఈ మొత్తాన్నిఆదివారం సీఐ క్రిష్ణంరాజు చేతులమీదుగా గ్రామపెద్దలకు అందించారు.
వివరాల ప్రకారం నవరాత్రులకు ముందు మండలంలో సీఐ ఆధ్వర్యంలో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక మండపాల వద్ద తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా భక్తిపాటలు, భజనలు, కోలాటాలు, బతుకమ్మలు ప్రదర్శిస్తూ నవరాత్రలు నిర్వహించే గ్రామానికి లక్ష రూపాయల బహుమతి ఇస్తానని మహమ్మద్నగర్ గ్రామానికి చెందిన కోఆప్సన్ మెంబరు సులేమాన్ కుమారుడు ఆసీఫ్ అలీ ప్రకటించారు.
కాగా సీఐ ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు అన్ని గ్రామాల వినాయకులను సందర్శించి దాసర్లపల్లిని ఉత్తమ వినాయక మండప గ్రామంగా ఎంపిక చేశారు.దీంతో అలీ తను ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయల బహుమతిని అందించాడు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొలెమోని బాలమణి అశోక్ముదిరాజ్, ఎంపీటీసీ తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, చండీ ఉపాసకులు రెవెల్లే రాజుశర్మ, జంబుల దయాకర్, మీగడి క్రిష్ణయ్య, ఉప సర్పంచ్ మంగదేవి, వార్డు మెంబర్లు, గణేష్ ఉత్సవ కమిటి సభ్యులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.