ఉస్మానియా యూనివర్సిటీ : అతిచిన్న వయసులోనే తన అసమాన ప్రతిభతో బేబీ స్వాదింత తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. లాలాపేటలోని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన సుమన్, గుల్లే రేఖ కుమార్తె అయిన టీజీ స్వాదింత కేవలం 30 నెలల వయసులోనే తన నిరుమానమైన మేధస్సుతో అందరినీ ఆకట్టుకుంది.
స్కూల్ తలుపులు కూడా చూడని ఆ చిన్నారి 24 నెలల వయసులోనే ప్రపంచంలోని 195 దేశాల జెండాలను గుర్తించడంతో పాటు వివిధ జీకే ప్రశ్నలకు ఎటువంటి తడబాటు లేకుండా జవాబులిస్తోంది. శాస్త్రజ్ఞుల పరిశోధనలు, జంతువుల పేర్లు, రసాయనిక మూలకాల పేర్లు, చేతి వృత్తులు, డాక్టర్లు – వారి ప్రత్యేకతలు, పజిల్స్, కరెన్సీ నోట్లు, దేశరాజధానులు, ప్రపంచ పటంలో దేశాలను పజిల్స్ ప్రక్రియలో గుర్తించి రెండు అవార్డులను స్వంతం చేసుకుని అందరినీ అబ్బురపరిచింది.
ఈ సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అధినేత డాక్టర్ చింతపట్ల వెంకటాచారి మాట్లాడుతూ అతి చిన్న వయసులో తన జ్ఞాపిక శక్తిని ప్రదర్శించిన చిన్నారి స్వాదింత పేరును రికార్డ్స్లో నమోదు చేస్తున్నట్లు ప్రకటించారు. సంబంధిత ధృవపత్రం, జ్ఞాపిక, బ్యాడ్జిలను చిన్నారి తల్లిదండ్రులకు బహూకరించారు.