కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : కేంద్ర సర్కారు వడ్లు కొనుగోలు చేయబోమని స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులు వ్యవసాయ అనుబంధ రం గాల్లో ఒకటైన చేపల పెంపకంపై దృష్టి పెడుతున్నారు. మత్స్యశాఖ అధికారులు కూడా రైతులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. రైతు లు తమకున్న భూముల్లో చేపల చెరువులను తవ్వుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచిస్తున్నారు. చేపల పెంపకంపై ఇటీవల కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులతో సమీక్ష నిర్వహిం చి పలు సూచనలు చేశారు. చేపల పెంపకానికి ముందుకు వచ్చే రైతులను ప్రోత్సహించాలని, ముఖ్యంగా ప్రాజెక్టుల కెనాల్స్ సమీపంలో చేపలు పెంచుకునేందుకు ముందుకు వచ్చే రైతులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. జిల్లాలో గతం లో 40 ఎకరాల్లో చేపల చెరువులు ఉండగా, ఈ రెండేళ్లలో 62 ఎకరాలకు పెరిగింది.
రైతులకు రాయితీలు..
జిల్లాలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపల పెంపకానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది. 100 శాతం సబ్సిడీపై జిల్లాలోని 235 చెరువులు, 10 పెద్ద చెరువులు, 4 రిజర్వాయర్లలో చేప పిల్లల పెంపకం చేపడుతూ మత్స్యకారులకు ఉపాధి చూపుతున్నది. ఈ ఏడాది కోటీ 37 లక్షల చేప పిల్లలను జలవనరుల్లో వేసింది. దీని ద్వారా 5 వేల మత్య్సకార కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. మరోవైపు వ్యక్తిగతంగా తమ భూముల్లో చేప ల చెరువులు ఏర్పాటు చేసుకునే రైతులకు రా యితీలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 60 శాతం, బీసీ, ఓసీ రైతులకు 40 శాతం సబ్సిడీ అందిస్తోంది. చేప పిల్లల హేచరీ నిర్మాణం, ఆక్వాకల్చర్ సిస్టం, కేజ్ కల్చర్, ఫిష్ ఫీడ్ తయారీ, వాహనాలు సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ఈ సబ్సిడీలను అందిస్తున్నది.