అంబులెన్సులు దొరకక పేదలు ఇబ్బంది పడకూడదు
డీఎంహెచ్వోకు ఎంపీ నామా నాగేశ్వరరావు ఫోన్
ఖమ్మం, మే 29: కరోనా వేళ అన్ని అంబులెన్సులనూ అందుబాటులో ఉంచాలని, అంబులెన్సులు దొరకక ఎవరూ ఇబ్బందులు పడకూడదని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు శనివారం ఖమ్మం డీఎంహెచ్వో డాక్టర్ మాలతికి ఫోన్ చేసి ఆరా తీశారు. డబుల్ డ్రైవర్లును నియమించి వాటిని నిత్యం పేదలకు అందుబాటులో ఉంచాలని ఎంపీ డీఎంహెచ్ఓను ఆదేశించారు. అన్ని చోట్లా రెండు షిఫ్టుల్లో ఉండే విధంగా డ్రైవర్లను నియమించాలని, చిన్న చిన్న సాంకేతిక సమస్యలు ఉంటే పరిష్కరించి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా.. మధిరలో ఓ విలేకరి తండ్రికి ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్ సలహా మేరకు ఎంపీ నామా ఏర్పాటు చేసిన అంబులెన్సులో అతణ్ని ఖమ్మం తరలించారు. ఖమ్మం జిల్లాలోని నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన అంబులెన్సులు పేదలకు ఎల్లవేళలా సాయపడాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ప్రజలు కూడా వీటిని వినియోగించుకోవాలని కోరారు.