ఖమ్మం జిల్లా దవాఖానను బలోపేతం చేశాం
చిన్నారుల కోసం ఎంసీహెచ్లో ప్రత్యేక వార్డు
ప్రైవేట్ దోపిడీని అరికట్టేందుకు పటిష్ట నిఘా
ఏజెన్సీ ప్రజల వైద్యంపై సీఎం కేసీఆర్ దృష్టి
గూడెం’లో వైద్యకళాశాల ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్
విపక్షాలు అర్థంలేని విమర్శలు చేయడం సిగ్గుచేటు
విలేకరుల సమావేశంలో మంత్రి అజయ్కుమార్
ఖమ్మం, మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని అరికట్టడంలో, బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పనితీరు భేష్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ కితాబిచ్చారు. ఖమ్మం ప్రధాన వైద్యశాల ఎంసీహెచ్ భవనంలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సర్కారు దవాఖానను అత్యంత బలోపేతంగా తయారు చేశామన్నారు. తాను ఖమ్మం ఎమ్మెల్యేగా గెలిచిన తొలినాళ్లలో 250 నుంచి 300 బెడ్లు మాత్రమే ఉండేవని గుర్తుచేశారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ సహకారంతో 550 బెడ్లను ఏర్పాటు చేశామన్నారు. 35 వెంటిలేటర్లు, 10 సీప్యాప్, 40 ఐసీయూ, కార్డియాలజీ, టర్మనాలజీ బెడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు.
300 బెడ్లకు సెంట్రల్ ఆక్సిజన్..
ఇటీవల ఆక్సిజన్, రెమ్డెసివిర్ కొరత కారణంగా భయాందోళనకు గురై అనేక మంది కొవిడ్ బాధితులు మనోధైర్యాన్ని కోల్పోయి మృత్యువాత పడ్డారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ బాధితుల కోసం 320 బెడ్లను ఏర్పాటు చేశామన్నారు. వాటిల్లోని 300 బెడ్లకు సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రాణ వాయువుకు కొరత రాకుండా 13 కేఎల్ లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్తోపాటు ఐటీసీ నుంచి రోజుకు 5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను తెప్పిస్తున్నామని తెలిపారు. మరో 125 బెడ్లకు సరిపోయే ఆటోమేటిక్ ఆక్సిజన్ జనరేటెడ్ ప్లాంట్ను కూడా ప్రారంభించుకున్నామని, క్లినికల్ ట్రయల్స్ అనంతరం అందుబాటులోకి వస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రతిరోజూ బెడ్ల కోసం అనేక మంది కొవిడ్ బాధితులు పెద్దాసుపత్రి ముందు క్యూ కడుతున్నారంటే.. ప్రభుత్వం కల్పించిన వసతులు, కలెక్టర్ కర్ణన్ నిరంతర పర్యవేక్షణ, వైద్యులు, సిబ్బంది పనితీరుకు అద్దం పడుతున్నదని వ్యాఖ్యానించారు.
చిన్నారుల కోసం ప్రత్యేక వార్డు..
థర్డ్ వేవ్ ప్రచారం నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే కరోనా సోకిన, భవిష్యత్లో వైరస్ బారిన పడే 12 ఏళ్లలోపు పసి వాళ్లకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఖమ్మం ప్రధాన వైద్యశాల ఎంసీహెచ్ భవనంలో 40 బెడ్లతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసుకున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. కొవిడ్తో కోలుకున్న అనంతరం ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉన్న బాధితుల కోసం ఇంటి దగ్గరకే ఆక్సిజన్ను సరఫరా చేస్తామన్నారు. ఇప్పటికే ఎన్ఆర్ఐ ఫౌండేషన్, ఇతర సంస్థలు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కొన్నింటిని విరాళంగా అందజేశాయని, వివిధ దేశాల్లో స్థిరపడిన ఖమ్మం వాసులు సైతం ముందుకు వస్తున్నారని ప్రకటించారు.
కరోనా తగ్గుముఖం..
ఉమ్మడి జిల్లాలో కరోనా తగ్గుముఖం పడుతోందని మంత్రి పేర్కొన్నారు. ఇంటింటి సర్వే కూడా సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. ఇక నుంచి వైద్యారోగ్యశాఖతోపాటు సర్వే బృందాలతో కరోనా పరీక్షలు చేయించనున్నామన్నారు. సత్తుపల్లి, మధిర, పెనుబల్లి వైద్యశాలల్లో కరోనా వైద్య సేవల్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. గురువారం నుంచి సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 18-44 ఏళ్లలోపు వారికి ప్రైవేట్ దవాఖానల ద్వారా టీకాలు వేస్తారన్నారు. ఖమ్మం వైద్యశాలలకు అవకాశం దక్కేలా చూస్తామన్నారు. ప్రైవేట్ దవాఖానలో కరోనా బాధితుల నుంచి అధిక ఫీజుల వసూలును అరికట్టేందుకు పటిష్ట నిఘాను ఏర్పాటు చేశామన్నారు.
ఏజెన్సీ ప్రజల కోసమే సీఎం ఆరాటం..
భద్రాద్రి ఏజెన్సీ ప్రజలందరికీ మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నదే సీఎం ప్రధాన ఆశయమని అన్నారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొత్తగూడెంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారన్నారు. అయినా విపక్షాలు అర్థంలేని ఆరోపణలు చేయడం సిగ్గచేటు అని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఖమ్మం కలెక్టర్ కర్ణన్, మేయర్ నీరజ, డిఫ్యూటీ మేయర్ ఫాతిమా, కేఎంసీ కమిషనర్ అనురాగ్ జయంతి, డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో డాక్టర్ శ్రీనివాసరావు, డైటీషియన్ మేరీ, నందగిరి శ్రీను, ఆర్వీ సాగర్ పాల్గొన్నారు.