అధికారులు అప్రమత్తంగా ఉండాలి
వసతులతో పునరావాస కేంద్రాలు సిద్ధం చేయాలి
మెడికల్ క్యాంపులు నిర్వహించాలి
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
భద్రాచలం, జూలై 23: ముంపువాసులకు సర్కార్ అండగా ఉంటుందని,ప్రజలెవరూ ఆందోళనకు గురికావొద్దని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. భద్రాచలంలోని సబ్కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన వరద సహాయక చర్యలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పర్యటనకు విచ్చేశానన్నారు. గోదావరి వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామన్నారు. నీటిమట్టం పెరిగే వరకు వేచి ఉండకుండా అధికారులు ముంపు ప్రాంతాల వారిని ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. వారికి భోజనం, వసతి ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టర్ భద్రాచలం క్యాంప్ కార్యాలయంలోనే ఉండి పరిస్థితులను సమీక్షిస్తారన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వరద సహాయక చర్యలు పటిష్టంగా చేపడుతున్నామన్నారు. వరద నీటిని తోడెందుకు మోటార్లు సిద్ధంగా ఉంచామన్నారు. పట్టణంలోని విస్టా కాంప్లెక్స్ వద్ద ఇప్పటికే ఆరు మోటార్లు ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గ పరిధిలోని 47 పునరావాస కేంద్రాల్లో ముంపు వాసులకు వసతి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వారికి అవసరమైన మెడికల్ కిట్లు సమకూర్చామన్నారు. మండలాల వారీగా నాటు పడవల యజమానుల ఫోన్లు నెంబర్లు సేకరించామని, ముంపువాసులను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆయా మండలాల తహసీల్దార్లు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సాయం చేస్తారన్నారు. ఈసారి ఒక నెల ముందుగానే వరదలు వచ్చాయన్నారు. వరద పెరుగుతన్న నేపథ్యంలో నీటి మట్టాన్ని బట్టి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తామన్నారు. భద్రాచలం కరకట్టపై ప్రజలు తిరగకుండా పోలీస్శాఖ చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణకు షిఫ్టుల వారీగా సిబ్బందిని నియమించాలని డీపీవో ఆదేశించారు. పునరావాస కేంద్రాలల్లో మెడికల్ టెస్టులు నిర్వహించాలని డీఎంహెచ్వో
శిరీషను ఆదేశించారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో అత్యవసర వైద్యం అందించేందుకు 10 పడకలు సిద్ధం చేయాలన్నారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందన్నారు. సమావేశంలో ఎస్పీ సునీల్దత్, ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, భద్రాచలం ఇన్చార్జి ఏఎస్పీ డాక్టర్ శబరీశ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
గోదావరిలో వరద ఉధృతి పరిశీలన
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ముందుగా భద్రాచలంలోని వంతెనపై నుంచి గోదావరిలో వరద ఉధృతిని పరిశీలించారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నదిలో భారీగా వరద నీరు చేరుతున్నదని కలెక్టర్ అనుదీప్ మంత్రికి వివరించారు. వరద ఉధృతిని బట్టి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తామన్నారు. వారి వెంట ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఉన్నారు.
పెరుగుతున్న గోదావరి
భద్రాచలం, జూలై23: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. మేడిగడ్డ, తాలిపేరు ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు విడుదలవుతుండడంతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తున్నది. ఉదయం 10 గంటలకు 21.70అడుగులు ఉన్న గోదావరి, రాత్రి 8గంటల సమయంలో 29.20అడుగులకు చేరింది. రాత్రి 10గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక అయిన 43అడుగులకు చేరుకుంటుందని అధికారులు పేర్కొన్నారు. తెల్లవారుజాము వరకు మూడో ప్రమాద హెచ్చరిక 53అడుగులకు చేరుకుంటుందని తెలిపారు. భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి భద్రాచలంలోనే ఉండి వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అన్ని శాఖల అధికారులు వరద సహాయక చర్యల్లో సిద్ధంగా ఉన్నారు.