ఆదిలాబాద్ రూరల్, జూన్ 23 : పట్టణ సుందరీకరణకు, పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆదిలాబాద్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ బాలికల కళాశాల సమీపంలో వీధి వ్యాపారులకు నిర్మిస్తున్న దుకాణ సముదాయాలపై అభ్యంతరాలు వచ్చాయన్నారు. పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, అనధికారికంగా ఆక్రమించి రోడ్లపై నిర్మించిన వాటిని తొలగించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్లపై ఇటుక, కంకర, ఇసుక వంటి వ్యాపారాలు నిర్వహించడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వీధి వ్యాపారులకు శాశ్వత పరిష్కారం కోసం షెడ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ శైలజ మాట్లాడుతూ.. పట్టణంలో ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల కోసం ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ.. పట్టణంలో ఆక్రమణలు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టాలని సూచించారు. డిగ్రీ కళాశాల సమీపంలో నిర్మిస్తున్న షెడ్లపై కలెక్టర్కు వివరిస్తామన్నారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, డీపీవో శ్రీనివాస్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.