అభివృద్ధి పనుల్లో ముందంజ
ఆదర్శంగా నిలుస్తున్న గిరిజన పల్లె
రెండేండ్లలో ‘రూ.50 లక్షల’ అభివృద్ధి
ప్రభుత్వ లక్ష్యాలు పూర్తి
కూసుమంచి రూరల్, జూన్ 23: రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం 500 జనాభా ఉన్న పల్లెలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి బాటలు వేసింది. నాటి నిర్ణయం ఇప్పుడు సత్ఫలితాలనిస్తున్నది. ఆయా పంచాయతీలు ప్రస్తుతం ప్రగతి బాటలో పయనిస్తున్నాయి.. ప్రభుత్వం విడుదల చేస్తున్న పల్లె ప్రగతి నిధులను సద్వినియోగం చేసుకుని పాలకవర్గాలు గణనీయమైన అభివృద్ధిని సాధించాయి.. ఈ కోవకు చెందినదే కూసుమంచి మండలంలోని గంగబండ తండా. 1,860 జనాభా, 929 మంది ఓటర్లు ఉన్న పూర్తి గిరిజన గ్రామమైన ఈ పంచాయతీ ఇతర పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
జరిగిన అభివృద్ధి ఇదీ..
జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం నెల నెలా విడుదల చేస్తున్న రూ.2.40 లక్షల నిధులతో పాలకవర్గం గ్రామస్తులకు మౌలిక వసతులు కల్పిస్తున్నది. గ్రామంలో రూ.35 లక్షలతో ఏడు సీసీ రోడ్లు నిర్మించింది. రూ.12.50 లక్షలతో వైకుంఠధామం, రూ.2.25 లక్షలతో కంపోస్ట్ షెడ్, రూ.2 లక్షలతో డంపింగ్ యార్డ్, ప్రభుత్వ స్థలాల్లో పల్లె ప్రకృతి వనం, నర్సరీ ఏర్పాటు చేసింది. పల్లె ప్రగతి పనుల్లో భాగంగా పాడుబడిన బావులను పూడ్పించింది. గ్రామంలో కంప చెట్లను తొలగించింది. శిథిలమైన ఇండ్లను కూల్చివేయించింది. వాలిన, విరిగిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయించింది. ఇలా గ్రామంలో సుమారు రూ.50 లక్షల నిధలను వెచ్చించి ప్రగతి సాధించింది.
పారిశుధ్యంపై దృష్టి..
గ్రామస్తులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ట్రాక్టర్లో చెత్తాచెదారాన్ని సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. వారంలో రెండుసార్లు వీధుల్లో బ్లీచింగ్ చల్లుతున్నారు. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులను పాలకవర్గం సిబ్బంది జీతాలు, కార్యాలయం అద్దె, ట్రాక్టర్ నిర్వహణకు వెచ్చిస్తున్నది. అందరి సహకారంతో అభివృద్ధి చేపట్టామని, మున్ముందు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సర్పంచ్ కిషన్ తెలిపారు.
అభివృద్ధిలో రాజీలేదు..
పంచాయతీకి మంజూరైన ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకున్నాం. పంచాయతీ అభివృద్ధిలో రాజీ లేకుండా పని చేస్తున్నాం. భవిష్యత్తులో ‘మా కాలంలో అభివృద్ధి జరిగింది..’ అని గర్వంగా చెప్పుకునేలా ‘పల్లె ప్రగతి’ పనులు పూర్తి చేశాం. నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు. – బానోత్ కిషన్, సర్పంచ్, గంగబండ తండా