జిల్లాలో 27 రోడ్ల నిర్మాణానికి అటవీశాఖ క్లియరెన్స్
ఇటీవల జడ్పీ సమావేశంలో ప్రకటించిన డీఎఫ్వో శాంతారాం
త్వరలో పనులు ప్రారంభించే అవకాశం
మారుమూల ప్రాంతాలకు మెరుగుపడనున్న రవాణా
కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో అటవీ శాఖ అనుమతులు లేక నిలిచిన రోడ్లకు త్వరలో మోక్షం లభించనున్నది. అటవీ సంపదకు, వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండా ఈ రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. పీఎంజీఎస్వై ద్వారా రూ. 53.11కోట్లతో నిర్మిస్తున్న 17 రోడ్లకు అటవీ అనుమతులు లేక అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దాదాపు 75.46 కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్ల నిర్మాణంతో సుమారు 50.02 హెక్టార్ల అడవికి నష్టం జరగనుండగా, అటవీశాఖ అభ్యంతరాలు తెలిపింది. మరోవైపు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల(ఐఏపీ) అభివృద్ధి నిధులు రూ.20.53 కోట్లతో నిర్మిస్తున్న 11 రోడ్లను కూడా ఇదే కారణాలతో నిలిపివేశారు.
ఎట్టకేలకు అనుమతులు..
ఇటీవల కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జడ్పీ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి శాంతారాం మాట్లాడుతూ రోడ్ల నిర్మాణాలకు అనుమతులు వచ్చినట్లు తెలిపారు. కెరమెరి మండలం అల్లిగూడ, దహెగాం మండలం చిన్నగుండాయిపేట్, ఖర్జి నుంచి మొట్లగూడ, జైనూర్ మండలం జాడూగూడ, తిర్యాణి మండలం దంతన్పల్లి, గుండాల, దొడ్డిగూడ, నాగుగూడ, కాగజ్నగర్ మండలం ఓట్పల్లి, బెజ్జూర్ మండలం మొట్లగూడ, గెర్రె, తలాయి, కౌటాల మండలం కనికి, చింతలమానేపల్లి మండలం కేతిని, కోసిని, అంబగట్ట పెంచికల్పేట మండలం కర్జవెల్లి రోడ్లు పూర్తికానున్నాయి. ఇదేవిధంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులతో రోడ్లను నిర్మించనున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఖమాన నుంచి సర్కెపల్లి రోడ్డు, మోవాడ్ నుంచి కౌటాన్ మోవాడ్ రోడ్లు, మంగి నుంచి దంపూర్, రాఘవాపూర్ నుంచి గోపెన రోడ్డ్డు, సిర్పూర్ నియోజకవర్గంలోని బారెగూడ నుంచి బెజ్జూర్, దిందా నుంచి చిత్తం రోడ్డు, కమ్మర గాం నుంచి నందిగాం రోడ్లు, పాపన్నపేట్ నుంచి కోర్సిని, హట్టి నుంచి జోడెఘాట్లో నిలిచిపోయి రోడ్లకు అనుమతులు లభించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ఆయా ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర కమిటీ మొత్తంగా 27 రోడ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది. అడవులను సంరక్షించడంతో పాటు వన్యప్రాణులు అటవీ ప్రాంతాల గుండా రోడ్లను దాటి వెళ్లే మార్గాలు (క్రాసింగ్)లను గుర్తించారు. వన్యప్రాణులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, వాటి సంచారానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా రోడ్ల దాటేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నారు.
27 రోడ్లకు అనుమతులు వచ్చాయి..
జిల్లాలో అటవీ శాఖ అనుమతులు లేక ఇంతకాలం నిలిచిపోయిన 27 రోడ్ల నిర్మాణానికి అనుమతి వచ్చింది. మొత్తం 28 రోడ్ల అనుమతుల కోసం నివేదికలు పంపించాం. ఉన్నతాధికారులు వాటిని పరిశీలించి, 27 రోడ్లకు అనుమతులు ఇచ్చారు. త్వరలోనే పనులు చేపట్టవచ్చు. అడవులు, వన్యప్రాణులకు ఎలాంటి ఆటంకం, ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడుతూ అనుమతులు వచ్చిన రోడ్లను పూర్తి చేసుకోవచ్చు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో అర్ధంతరంగా నిలిచిపోయిన రోడ్లకు మోక్షం లభించనున్నది. పీఎంజీఎస్వై, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులతో 28 రోడ్లు నిర్మించాల్సి ఉండగా, అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణను దృష్టిలో పెట్టుకొని అటవీశాఖ అనుమతులు నిలిపివేసింది. ఇటీవల ఆయా ప్రాంతాల్లో పరిశీలించిన కేంద్ర కమిటీ ఎట్టకేలకు 27 నిర్మాణాలకు క్లియరెన్స్ ఇచ్చింది. ఏళ్లకేళ్లుగా నిలిచిపోయిన పనులు త్వరలో ప్రారంభించే అవకాశముండగా, మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనున్నది.