పార్టీకి కార్యకర్తలే నిజమైన సైనికులు
దేశంలోనే దళితబంధు గొప్ప పథకం
టీఆర్ఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
అభివృద్ధే ప్రధాన ధ్యేయం
ఎమ్మెల్యే రమేశ్బాబు
వేములవాడలో గ్రామ, వార్డు కమిటీలతో సమావేశం
వేములవాడ, సెప్టెంబర్ 15: టీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్, మంత్రి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని టీఆర్ఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య స్పష్టం చేశారు. వేములవాడ నియోజకవర్గస్థాయిలో నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలతో మహారాజ ఫంక్షన్హాల్లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సారయ్య మాట్లాడుతూ, గ్రామ స్థాయి కార్యకర్తలే పార్టీకి నిజమైన సైనికులని కొనియాడారు. ప్రతి గ్రామంలో పది కమిటీలు ఎన్నిక కాగా, ఒక్కో కమిటీలో 11 మంది సభ్యులున్నారని తెలిపారు. ప్రతి గ్రామంలో మొత్తం 110మందితో మన బలం పెరిగిందన్నారు. మహిళలు, రైతులు, యువకులు పార్టీకి పట్టుగొమ్మలన్నారు. ఉమ్మడి జిల్లాలో మహిళా సదస్సులను ఏర్పాటుచేసి మరింత చైతన్యవంతం చేద్దామని పిలుపునిచ్చారు. దేశంలోనే దళితబంధు గొప్ప సంక్షేమ పథకమని, చరిత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకం ద్వారా చిరస్థాయిలో నిలిచిపోతారని కొనియాడారు. కమిటీల ఎన్నికల్లో తనదైన పాత్ర పోషించిన ఎమ్మెల్యే రమేశ్బాబు నిబద్ధతకు మారుపేరని అభినందించారు. పార్టీ జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి మాట్లాడుతూ, మనం పన్నులు కడితే కేంద్రం కేవలం 60శాతం మాత్రమే తిరిగి ఇస్తుందని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటకో అబద్ధం చెబు తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ అన్ని మతాలకు ప్రాధాన్యమిస్తున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాలను కమిటీలు తిప్పికొట్టాలని సూచించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా పని చేయడంతో ప్రజా క్షేత్రంలో ప్రజలు సరైన తీర్పు ఇస్తూ ఆదర్శిస్తున్నారని గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి రెండున్నర కోట్లు వచ్చాయని, అందరికి సమన్యాయం చేస్తామన్నారు. దళిత బం ధు పేరుతో దండోరా చేయడం కాదని, దళితుల భూములను లాక్కున్న నాయకుడు తిరిగి వారికి అప్పగిస్తే రుద్రంగిలోని అంబేద్కర్ సాక్షిగా తానే సన్మానిస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాల జడ్పీ చైర్పర్సన్లు న్యాలకొండ అరుణ, దావ వసంత, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, జగిత్యాల జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్రావు, ఎంపీపీలు బూర వజ్రమ్మ, గంగం స్వరూపారాణి, చంద్రయ్యగౌడ్, రేవతి, ఉమాదేవి, జడ్పీటీసీలు మ్యాకల రవి, గట్ల మీనయ్య, నాగం భూమయ్య, ఏఎంసీ చైర్మన్లు గడ్డం హన్మాండ్లు, శ్రీనివాసరావు, నాగేశ్వర్రావు, మండలాధ్యక్షులు ఊరడి ప్రవీణ్, న్యాలకొండ రాఘవరెడ్డి, మరాఠి మల్లిక్, శంకర్, అంకం సాగర్, కమలాకర్, నాయకులు పాల్గొన్నారు.