నీళ్ల గోస తీరి పంటల జిల్లాగా మారింది
సీఎం చేతులమీదుగా 100 పడకల దవాఖానను ప్రారంభించుకుందాం
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
లాభసాటి చర్చ కోసమే రైతు వేదికలు : మంత్రి జగదీశ్రెడ్డి
నల్లగొండ ప్రతినిధి, జూన్15(నమస్తే తెలంగాణ) : ‘ఏడేండ్ల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కరెంటు లేదు.. నీళ్లు లేవు.. ఇక్కడే ముషంపల్లిలో రాంరెడ్డి అనే రైతు 50 బోర్లకు పైగా వేసినా చుక్కనీరు రాని పరిస్థితి. ఆనాడు ప్రాజెక్టులు కట్టలేదు… ఉన్న నీళ్లతో వ్యవసాయం చేద్దామంటే కరెంట్ కోతలు, కల్తీ విత్తనాలు. ఎన్నో కష్టాల కోర్చి పంట పండిస్తే కొనేదిక్కే లేకపోయేది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారినయ్. సీఎం కేసీఆర్ నిర్ణయాలు ప్రజలకు మంచి ఫలితాలు ఇస్తున్నాయ్. వందల బోర్లు వేసినా చుక్క నీళ్లు రాని పూర్వపు నల్లగొండ జిల్లా నేడు రాష్ట్రంలోనే అత్యధిక దిగుబడులు సాధిస్తున్నది. ఈ ఏడాది రెండు సీజన్లలో కలిపి 60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి రాష్ర్టానికే దిక్సూచిగా నిలిచింది. ఇది కదా మార్పు అంటే.
స్వరాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో అద్భుత ప్రగతికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి’
అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం నకిరేకల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పాల్గొన్నారు. కేతేపల్లి మండలం భీమారంలో రైతువేదిక, స్కూల్ భవనాలను ప్రారంభించడంతో పాటు అక్కడి నుంచి నకిరేకల్లో వంద పడకల దవాఖానకు, సీసీ రోడ్లకు, నూతన మార్కెట్కు శంకుస్థాపనలు చేశారు. అనంతరం సర్వహంగులతో నిర్మించిన వైకుంఠధామాన్ని, రైతువేదికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిమ్మ మార్కెట్ ఆవరణలో నిర్వహించిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. దేశంలోనే వ్యవసాయంలో అద్భుత ప్రగతితో తెలంగాణ దూసుకుపోతున్నదన్నారు.
కేసీఆర్ నేతృత్వంలో ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, రైతుబంధు, రైతుబీమా, పంటల కొనుగోళ్ల వంటి పథకాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. రైతు వేదికలను సద్వినియోగం చేసుకుని మంచి పంటలు పండించాలని కోరారు. అనంతరం మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ 20ఏండ్ల కిందటే జలదృశ్యంలో మీటింగ్ సందర్భంగా… రాష్టం వస్తే ఏం జరుగుతుందో చెప్పిన సీఎం కేసీఆర్ నేడు వాటిని నెరవేరుస్తూ అన్ని రంగాల్లో నంబర్ వన్గా తీర్చిదిద్దుతున్నారన్నారు. నాగార్జునసాగర్లో నీటివాటా సహా సాగునీటి వనరులు దక్కాలంటే రాష్ట్రం రావాల్సిందేనని కేసీఆర్ ఆనాడే చెప్పాడని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా స్వరాష్టంలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తున్న ఘనత కేసీఆర్దే అన్నారు. కేసీఆర్ ఏదైనా పదేళ్ల ముందే ఆలోచిస్తారని, రైతు వేదికలు రైతులకు కరదీపికలుగా మారనున్నాయని పేర్కొన్నారు.
ప్రత్యేక ధన్యవాదాలు : ఎమ్మెల్యేచిరుమర్తి లింగయ్య
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ నకిరేకల్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధతో నిధులు మంజూరు చేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నకిరేకల్కు ఎంతో ముఖ్యమైన వంద పడకల ఆస్పత్రికి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పెండింగ్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేందుకు ముందుకు సాగుతున్నామన్నారు. కార్యక్రమాల్లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యేలు ఎన్.భాస్కర్రావు, గాదరి కిశోర్కుమార్, పైళ్ల శేఖర్రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, కంచర్ల భూపాల్రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్, డీసీసీబీ చైర్మన్ జి.మహేందర్రెడ్డి, రైతుబంధు జిల్లా కన్వీనర్ రాంచందర్నాయక్, పార్టీ రాష్ట్ర నేత తక్కెళ్లపల్లి రవీందర్రావు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్, మాజీ ఎమ్మెల్యే కె.ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
బడుగులకు ఉన్నత పదవులు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే..
ఎంపీ బడుగుల
కేతేపల్లి, జూన్ 15 : గొర్రెలను మేపుకొనే కులం నుంచి వచ్చి నన్ను అత్యున్నతమైన పెద్దల సభకు పంపిన సీఎం కేసీఆర్కు జీవితకాలం రుణపడి ఉంటానని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. కేతేపల్లి మండలంలోని భీమారం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. మారుమూల గ్రామమైన భీమారం అభివృద్ధికి రూ.5కోట్ల నిధులు మంజూరు చేయాలని స్థానిక సర్పంచ్ బడుగుల శ్రీనివాస్యాదవ్తో కలిసి మంత్రి కేటీఆర్కు వినతిపత్రం ఇచ్చారు.మంత్రి స్పందిస్తూ నూతన ఆరోగ్యకేంద్రం ఏర్పాటు, అవసరమైన మేరకు 25కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, గ్రామం నుంచి తుంగతుర్తికి వెళ్లే అంతర్గత రహదారి, నూతన గ్రామపంచాయతీ భవనం మంజూరు చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ను ఆదేశించారు.