ప్రభుత్వంలో ఉండి పథకాలను ‘పరిగె’ అంటడా..?
ఏకంగా సీఎం సీటుకే ఎసరు పెట్టిండు
మంత్రి గంగుల కమలాకర్
జమ్మికుంటలో ముఖ్య కార్యకర్తల సమావేశం
జమ్మికుంట, జూన్ 14: ‘మాజీ మంత్రి ఈటలకు పుట్ట గతులుండవ్. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను పరిగె అంటాడా..’ అని రాష్ట్ర బీసీ, సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పార్టీలో ఉన్నత పదవులన్నీ అనుభవించి, సీఎం సీటుకే ఎసరు పెట్టిన ద్రోహి, ఆయన కుట్రలను పటాపంచలు చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని చెప్పారు. సీఎం కేసీఆర్ ఒక వ్యక్తి కాదని, శక్తి అని పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో సోమవారం నిర్వహించిన టీఆర్ఎస్ మండలశాఖ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్తో కలిసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తన జీవితాన్నే పణంగా పెట్టిన గొప్ప మహానుభావుడని కొనియాడారు. తెలంగాణ ప్రజల బతుకులు మార్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని, ఆయన ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవని స్పష్టం చేశారు. తమ్ముడూ అని భుజం తట్టి ప్రోత్సహించిన నాయకుడు కేసీఆర్కు, పార్టీకి ద్రోహం చేసేందుకు సిద్ధమయ్యాడని ఈటలపై మండిపడ్డారు.
ఈటల రాజేందర్ ఎందుకు పార్టీ వీడారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఏండ్లకేండ్లు పాలించారని, అరవై ఏళ్ల పాలనలో ఏ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ఆదుకోలేదన్నారు. ఇప్పటికీ బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు ఎక్కడైనా ఉన్నాయా..? అని ప్రశ్నించారు. ఇది రైతు ప్రభుత్వమని, ప్రజల ఆశయాలను నెరవేర్చే సర్కారని తెలిపారు. నీళ్లు, నిధులు, ని యామకాల్లేక అరిగోసపడిన సందర్భాలను వివరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అందిస్తున్న పథకాలను చెప్పారు. ఈటల పార్టీ నుంచి పోయినంత మాత్రన నష్టమేమీ లేదని, అభివృద్ధి వంద రెట్లు కొనసాగిస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్కు హుజూరాబాద్ నియోజకవర్గం అంటే అభిమానం, ఇష్టమని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా టీఆర్ఎస్కే ఓటు వేసి గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన అందరిపై ఉందన్నారు. తర్వాత మంత్రిని గజమాలతో ఘనంగా సన్మానించారు.