ఆదిలాబాద్ కలెక్టర్సిక్తా పట్నాయక్
ఎదులాపురం,జూన్14: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన హరితహారం, పరిశుభ్రత, పల్లె ప్రగతి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి ఆదిలాబాద్ జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హరితహారం , పారిశుధ్యం, పల్లె ప్రగతి, సీజనల్ వ్యాధుల తదితర అంశాలపై సోమవారం జిల్లా కలెక్టరేట్లో మండల అభివృద్ధి అధికారులు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కలెక్టర్లు, డీపీవోలకు సీఎం కేసీఆర్ పలు అంశాలపై దిశానిర్దేశం చేశారని తెలిపారు. జిల్లాలో హరితహారం కార్యక్రమానికి లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటి జిల్లాను పచ్చదనంతో నింపాలన్నారు. మల్లీ లేయర్ పద్ధతిలో మొక్కలను నాటి సంరక్షించాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డీపీవోను ఆదేశించారు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఆరోగ్య కమిటీ సమావేశాలను తప్పని సరిగా నిర్వహించాలన్నారు. ఈ నెల 19 తర్వాత సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన నేపథ్యంలో జిల్లాలోని నర్సరీలను శుభ్రంగా ఉంచాలని, ఏయే మొక్కలను పెంచుతున్నారో తెలిసి ఉండాలన్నారు. స్థానిక సర్పంచ్ల సహకారంతో ప్రభుత్వ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. నిర్లక్ష్యం చూపిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం డేవిడ్, డీఆర్డీఏ పీడీ కిషన్, జిల్లా మలేరియా నివారణ అధికారి శ్రీధర్, జడ్పీ సీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్, పీఆర్ఈఈ మహావీర్, ఆర్ అండ్ బీ ఈఈ నర్సయ్య, ఎఫ్డీవో చంద్రశేఖర్, అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాధన, ఎంపీడీవోలు పాల్గొన్నారు.