ప్రభుత్వ దవాఖానలపై కేబినెట్ సబ్ కమిటీ నియామకం
అందరి సహకారంతోనే కొవిడ్ కేసులు తగ్గుముఖం
పేదల ప్రాణాలకు భరోసా కల్పించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం
అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల
నిర్మల్ అర్బన్/ఎదులాపురం/ ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, జూన్ 9:పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడానికే సీఎం కేసీఆర్ టీ-డయాగ్నోస్టిక్ సెంటర్స్ నెలకొల్పారని, నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆవరణ, నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానలో మంత్రి.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిర్మల్లో రూ.3 కోట్లు, ఆదిలాబాద్లో రూ.2.40 కోట్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రూ.38 లక్షలతో అధునాతన యంత్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు. 57 రకాల రోగ నిర్ధారణ వైద్య పరీక్షల ఫలితాలను ఉచితంగా పొందవచ్చని పేర్కొన్నారు.
నిర్మల్ అర్బన్, జూన్ 9 : పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడానికే సీఎం కేసీఆర్ టీ-డయాగ్నోస్టిక్ సెంటర్స్ నెలకొల్పారని, నిరుపేదలు సద్వినియోగం చేసుకొవాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానలో రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డయాగ్నోస్టిక్ హబ్ సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. బడ్జెట్ కేటాయింపులకు అదనంగా రూ.10 వేల కోట్లు వైద్య సేవలకు ముఖ్యమంత్రి కేటాయించారని వెల్లడించారు. ఇప్పటి వరకు కార్పొరేట్ దవాఖానలు, ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలకు పరిమితమైన వ్యాది నిర్ధారణ పరీక్షలను ఇప్పుడు సామాన్యుల చెంతకు చేరాయన్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్లో కరోనాతో పాటు రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, బీపీ, షుగర్, తదితర 57 రకాల పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగ నిర్ధారణ పరీక్షల నమూనాలు సేకరించి జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ సెంటర్కు పంపి పరీక్షల ఫలితాలను నేరుగా మొబైల్ ఫోన్కు ఎస్ఎంఎస్ చేస్తారని వివరించారు. భవిష్యత్తులో నిర్మల్ జిల్లాలో మరిన్ని వైద్య సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని మంత్రి తెలిపారు.
వాహనాల ప్రారంభం
జిల్లాలోని వివిధ పీహెచ్సీల నుంచి రక్తనమూనాలను సేకరించే ఐదు వాహనాలను జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానలో మంత్రి ప్రారంబించారు. అనంతనం జిల్లాలో వైద్య సేవలపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లా వైద్యశాలలో 250 బెడ్లు, ప్రసూతి దవాఖానలో 100 బెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రసూతి దవాఖానను మూడెకరాల స్థలంలో నూతనంగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం స్థల సేకరణ చేస్తున్నామని చెప్పారు. జిల్లా దవాఖాన ప్రాంతంలో లేదా అయ్యప్ప ఆలయం దగ్గరలో నిర్మించనున్నామని వెల్లడిం చారు. జిల్లా దవాఖానలో రోగులకు సరిపడా అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. అంకాలజీ, సీటీ స్కానింగ్ తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతామన్నారు. కరోన బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో డాక్టర్లు, సిబ్బంది కృషి చేశారని, తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స అందించారని అభినందించారు. పేదలను దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ వైద్యులు సైతం తక్కువ ఫీజుతో వైద్యం అందించడంతో పాటు సీటీ స్కానింగ్ రేట్లను రూ. 4500 నుంచి రూ. 2500 వరకు తగ్గించారన్నారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు కొరిపెల్లి విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డీఎంహెచ్వో ధన్రాజ్, దవాఖాన సూపరింటెండెంట్ దేవేందర్ రెడ్డి, ఆర్ఎంవో వేణుగోపాల కృష్ణ, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, నాయకలు తదితరులున్నారు.
పేదల ప్రాణాలకు భరోసా కల్పిస్తున్నాం..
ఎదులాపురం, జూన్ 9 : రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రాణాలకు భరోసా కల్పిస్తూ నాణ్యమైన వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆటవి, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని రిమ్స్ ఆవరణలో రూ.2.40 కోట్లతో ఏర్పాటు చేసిన టీ-డయాగ్నోస్టిక్ సెంటర్ను మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామ న్న, కలెక్టర్ సిక్తాపట్నాయక్, టీడీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, డీసీసీబీ చైర్మన్ నాందేవ్ కాంబ్లే, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైద్యశాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం టీ-డయాగ్నోస్టిక్ సెంటర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పని విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ రూమ్ ను ఎమ్మెల్యేలు, జడ్పీచైర్మన్, కలెక్టర్ కలిసి ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో రానున్న రెండేండ్లలో రూ.10 వేల కోట్లతో పీహెచ్సీ, జిల్లా ప్రభుత్వ దవాఖానల్లో అన్ని వసతులు, మౌలిక సదుపాయాలు, వైద్యుల నియామకం కల్పించేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమించడం జరిగిందన్నారు. వైద్య సిబ్బంది, పోలీసు సహకారంతో లాక్డౌన్ సక్సెస్ అయిందన్నారు. గతేడాది లాక్డౌన్లో సుమారుగా రూ.40 వేల కోట్ల నష్టం వచ్చినప్పటికీ సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగిస్తున్నామన్నారు.
నకిలీ విత్తనాలు అమ్మితే జైలుకు పంపిస్తామన్నారు. రాష్ట్రంలో 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఇక్కడ నిర్వహించే వైద్య పరీక్షలు ప్రైవేట్లో చేయించుకుంటే రూ.5 వేల వరకు ఖర్చు అవుతాయన్నారు. టీ-డయాగ్నోస్టిక్ సెంటర్లో 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మూడు నెలల నుంచి డయాగ్నోస్టిక్ సెంటర్లో ట్రయల్ రన్ నిర్వహించి లోటు పాట్లును సరిచేసుకున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో జాడే రాజేశ్వర్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్, డిప్యూటీ డీఎంహెచ్వో సాధన, డీఐవో విజయసారధి, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మున్సిపల్ కమిషనర్ శైలజ, రైతు సమితి అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి , కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.