శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ విజయవంతంగా నిర్వహించాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్ డీపీవో శ్రీకాంత్
కౌటాల, జూన్ 9 : పంచాయతీ కార్యదర్శులు బాధ్యతాయుతంగా పనులు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్ అన్నారు. కౌటాల పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శులు, సర్పంచ్లు, అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో కార్యదర్శులు విధిగా విధులు నిర్వహించాలని, రాబోయే వానకాలంలో పారిశుధ్య పనులు చేపట్టాలని సూచించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. అనంతరం కౌటాల ప్రకృతి వనాన్ని పరిశీలించి, చాలా బాగుందని, అన్ని రకాల మొక్కలు పెంచడం అభినందనీయమని పేర్కొన్నారు. అవసరమైతే వనం చుట్టూ షో చెట్లను నాటాలని సూచించారు. ఆ తర్వాత పంచాయతీలో ఇటీవల చేపట్టిన పలు అభివృద్ధి పనులు, సీసీ రోడ్లను స్వయంగా పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్, ఎంపీవో శ్రీధర్ రాజు, కౌటాల సర్పంచ్ వొజ్జల మౌనీశ్, ఉప సర్పంచ్ తిరుపతి, ఆయా గ్రామాల సర్పంచ్లు, కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు.
జీపీ కార్యదర్శులతో సమీక్ష..
సిర్పూర్(టి), జూన్ 9 : స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో డీపీవో శ్రీకాంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ విజయవంతంగా నిర్వహించాలని, కార్యక్రమాల్లో అలసత్వం వహించవద్దని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని పాతట్టగూడలోని శ్మశానవాటిక పనులను పరిశీలించారు. ఎంపీడీవో రాజేశ్వర్, ఇన్చార్జి ఎంపీవో కృష్ణమూర్తి, ఉప సర్పంచ్ తోట మహేశ్, ఎల్డీసీ సంతోష్, బిల్ కలెక్టర్ అనిల్కుమార్, పంచాయతీ కార్యర్శులు పాల్గొన్నారు.