మంచిర్యాలలో రూ.5 లక్షల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం
గర్మిళ్ల, జూన్ 9 : మంచిర్యాల జిల్లా కేంద్రంలో గుట్కా స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. సుమారు రూ.5 లక్షల విలువైన నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టణంలోని గోసేవా మండల్, రైల్వే అండర్ బ్రిడ్జి కాలనీల్లో ముందస్తు సమాచారం మేరకు తనిఖీ చేశారు. ఎండీ సలీం ఇంట్లో రూ. 1.30 లక్షల విలువైన ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులను సాధీనం చేసుకోగా, నిందితుడు పరారీలో ఉన్నాడు.
కాలేజ్ రోడ్డులో…
పట్ణణంలోని కాలేజ్ రోడ్లో మోటూరి రమేశ్ ఇంటి ఆవరణలో తనిఖీ చేయగా సుమారు రూ.3.50 లక్షల విలువైన గల నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కోసం పట్ణణ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న, సిబ్బంది సంపత్ కుమార్, రాకేశ్, ఓంకార్ పాల్గొన్నారు.
బెల్లంపల్లి పట్టణంలో..
బెల్లంపల్లిరూరల్, జూన్ 9: బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలోని రాచకొండ సాయివర్ధన్ అనే వ్యక్తి ఇంట్లో మంగళవారం రాత్రి తనిఖీ చేయగా రూ.55 వేల విలువ చేసే నిషేధిత పొగాకు ఉత్పత్తులు లభించినట్లు టాస్క్ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న తెలిపారు. సాయివర్ధన్ను విచారించగా కాగజ్నగర్ లోని బోడేపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తనకు సరఫరా చేసినట్లు అంగీకరించాడని ఎస్ఐ చెప్పారు. నిందితుడిని బెల్లంపల్లి టూటౌన్ ఎస్ఐ ఎస్ఐ భాస్కర్రావుకు అప్పగించినట్లు చెప్పారు. తనిఖీల్లో టాస్క్ఫోర్స్ సిబ్బంది వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, శ్యామ్సుందర్ పాల్గొన్నారు.
శ్రీరాంపూర్ హిమ్మత్నగర్లో..
శ్రీరాంపూర్, జూన్ 9 : శ్రీరాంపూర్ ఆర్కే 6 గుడిసెలు హిమ్మత్నగర్లో రాయపూడి నాగేశ్వర్రావు ఇంట్లో తనిఖీ చేయగా రూ. 20,945 విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నామని ఎస్ఐ మంగీలాల్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.