నగదు బహుమతులు గెల్చుకోండి
డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి
బచ్చన్నపేటలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ అధికారులకు అవగాహన సమావేశం
బచ్చన్నపేట, ఆగస్టు 5 : స్వచ్ఛభారత్ మిషన్ రెండో దశలో భాగంగా పారిశుద్యంపై లఘు చిత్రాలు తీసి నగదు బహుమతులు గెల్చుకోవాలని జనగామ డీఆర్డీవో గూడూరు రాంరెడ్డి సూచించారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ అధికారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. అనంతరం మార్కెట్ యార్డులో బృహత్ పల్లెప్రకృతి వనం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పారిశుధ్య ప్రగతిపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తడి, పొడి చెత్త నిర్వాహణ, ప్లాస్టిక్, ద్రవ్య వ్యర్థాల నిర్వాహణ వంటి అంశాలపై ప్రతి గ్రామపంచాయతీలో లఘుచిత్రం తీయాలన్నారు. ముఖ్యంగా చెత్త సేకరణ, వేరు చేయడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు వారిలో చైతన్యం నింపాలన్నారు. ఉత్తమ వీడియోలకు నగదు బహుమతులు అందిస్తామని అన్నారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఉపాధిహామీ కూలీలతో మొక్కలు నాటించి వారికి పని కల్పించాలన్నారు. కూలీల సంఖ్య మరింత పెంచాలన్నారు. క్షేత్రస్థాయిలో పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎస్బీఎం జిల్లా కోఆర్డినేటర్ కరుణాకర్ మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి సెగ్రిగేషన్ షెడ్కు పంపాలన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించే బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై ఉందన్నారు. లఘు చిత్రంపై సందేహాలుంటే తన మొబైల్ నంబర్ 9121221928ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రఘురామకృష్ణ, ఈసీ మోహన్, టీఏలు సత్యనారాయణ, స్వామి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. బృహత్ పల్లెప్రకృతి వనం పరిశీలన కార్యక్రమంలో సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, నాయకులు బావండ్ల కృష్ణంరాజు, గిరబోయిన అంజయ్య, పంచాయతీ కార్యదర్శి భీమ్రాజ్ తదితరులు పాల్గొన్నారు.