ఆక్సిజన్, మందుల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
నిర్మల్ టౌన్, మే 5: జిల్లాలో కొవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ వైద్యశాలలకు వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ వైద్యులను ఆదేశించారు. కరోనా వైరస్ చికిత్సపై కలెక్టరేట్లో ప్రైవేట్ దవాఖానల వైద్యులతో బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ వైద్యశాలల్లో కొవిడ్ చికిత్సను అందించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున, ప్రతి హాస్పిటల్లో బాధితుల కోసం ప్రత్యేక బెడ్లు, ఆక్సిజన్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రోగు ల ఆరోగ్యస్థితిని బట్టి వైద్యం చేయాలన్నారు. కొన్ని వైద్యశాలలు అవసరం లేకున్నా ఆక్సిజన్, ఖరీదైన మందులు, వెంటిలేటర్లు పెట్టి రోగుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.అటువంటి దవాఖానలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రైవేట్ దవాఖానాలో రోగులకు అందిస్తున్న చికిత్సలపై జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. పరీక్షల కోసం జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారని, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, సూపరింటెండెంట్ దేవేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ తదితరులున్నారు.