స్వరాష్ట్రంలో పెరిగిన ఆత్మగౌరవం
మన పథకాలు దేశానికే ఆదర్శం
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
సూర్యాపేటలో 285 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
సూర్యాపేట టౌన్, ఆగస్టు 4 : మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, సీఎం కేసీఆర్ పాలనలో ఆడబిడ్డల్లో ఆత్మగౌరవం పెరిగిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆత్మకూర్ (ఎస్), చివ్వెంల, పెన్పహాడ్ మండలాలకు చెందిన 285మందికి రూ.2.85కోట్ల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 60ఏండ్ల ఉమ్మడి పాలనలో తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఏడేండ్లలోనే పూడ్చడంతోపాటు రాష్ర్టాన్ని నంబర్ వన్గా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. ఉద్యమ సమయంలోనే అందరి కష్టాలు తెలుసుకుని.. వాటిని పరిష్కరిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. 24గంటల విద్యుత్, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా పథకాలతో వ్యవసాయానికి మంచిరోజులు వచ్చాయని పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. ప్రజలు అడుగకుండానే ప్రవేశపెడుతున్న పథకాలతో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో భారం అనుకున్న ఆడపిల్ల నేడు అదృష్టంగా మారిందని, ఈ మార్పు ముమ్మాటికీ టీఆర్ఎస్ సర్కారును నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, ఎంపీపీలు మర్ల స్వర్ణలతా చంద్రారెడ్డి, కుమారీ బాబూనాయక్, నెమ్మాది భిక్షం, జడ్పీటీసీలు సంజీవ్ నాయక్, మామిడి అనితా అంజయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ ముద్దం కృష్ణారెడ్డి, ఆర్డీఓ రాజేంద్రకుమార్తో పాటు ఎంపీటీసీలు, సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.
బృహత్ పల్లె ప్రకృతి వనం స్థల పరిశీలన
చివ్వెంల, ఆగస్టు 4 : బృహత్ పల్లె ప్రకృతి వనం పనులు త్వరగా ప్రారంభించాలని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం చివ్వెంల మండలం ఉండ్రుగొండ శివారులో లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో 12ఎకరాల స్థలాన్ని ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో అటవీ శాతాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వనాల ఏర్పాటును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఏఫ్ఓ ముకుంద్రెడ్డి, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎంపీపీ ధరావత్ కుమారీబాబూనాయక్, జడ్పీటీసీ భూక్యా సంజీవ్ నాయక్, వైస్ ఎంపీపీ జూలకంటి జీవన్రెడ్డి, మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ జమలారెడ్డి, తాసీల్దార్ రంగారావు, సర్పంచ్ పల్లేటి శైలజానాగయ్య పాల్గొన్నారు.