ఆహ్లాదకర వాతావరణంలో ఐసొలేషన్ కేంద్రం
కొవిడ్ బాధితులకు రోజూ పౌష్టికాహారం
చికెన్, గుడ్డు అందజేత
పంచాయతీ సిబ్బంది, ఆశాకార్యకర్తలు, దాతల సహకారంతో నిర్వహణ
తగ్గుముఖం పడుతున్న కేసులు
వైరా, జూన్ 4: కొవిడ్ కట్టడికి గ్రామాల్లో పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. కుటుంబంలో ఒకరికి వైరస్ సోకితే వారి ద్వారా ఇంటి సభ్యులకు వచ్చే అవకాశం ఉంది. పల్లెల్లో చాలీచాలని ఇండ్లలో కరోనా సోకిన వ్యక్తితో కుటుంబసభ్యులు ఉండాలంటే ఇబ్బందే. ఈ నేపథ్యంలో గ్రామాల్లో గ్రామస్తులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఐసొలేషన్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా వైరా మండలం సిరిపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రం జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్నది. ఇక్కడ బాధితులకు సకల సౌకర్యాలు కల్పించడంతోపాటు రోజూ పౌష్టికాహారం, చికెన్, కోడిగుడ్డు అందిస్తున్నారు. దీంతో బాధితులు త్వరగా కోలుకొని ఇంటిబాట పడుతున్నారు. అంతేకాదు, గ్రామంలో వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. – వైరా, జూన్ 4
ఖమ్మం జిల్లాలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ఆదేశాలతో పలు గ్రామాల్లో ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవి కరోనా కట్టడిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. వైరా మండలం సిరిపురం గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. గ్రామంలో వైరస్ బారిన పడినవారు స్వచ్ఛందంగా ఈ కేంద్రానికి వచ్చి చికిత్స పొందుతున్నారు. ఇక్కడ బాధితులకు రోజూ వైద్యపరీక్షలు నిర్వహించడంతోపాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. కేంద్రం ఆవరణలో పచ్చనిచెట్లు, ఆహ్లాదకర వాతావరణం ఉండడంతో బాధితులు చక్కగా సేద తీరుతున్నారు. రాత్రివేళల్లో పాఠశాల గదుల్లో నిద్రిస్తున్నారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అంతేకాదు, పలువురు దాతలు బాధితులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ముందుకొస్తున్నారు. బాధితులకు మండల వైద్యాధికారులు ఐ.శశిధర్, దారెల్లి సుచరిత వైద్యపరీక్షలు చేస్తున్నారు.
ప్రతిరోజూ చికెన్, గుడ్డు
సిరిపురం గ్రామంలో ఐసొలేషన్ కేంద్రంలో కొవిడ్ బాధితులకు చికిత్స అందించడంతో కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నది. ఇక్కడ 20 మందికిపైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరికి రోజూ చికెన్, కోడిగుడ్డుతోపాటు పండ్లు అందిస్తున్నారు. ఉదయాన్నే టిఫిన్, టీ, మధ్యాహ్న భోజనంలో చికెన్, రసం, పలు కూరలు, పెరుగు అందిస్తున్నారు. సాయంత్రం జామ, అరటి, మామిడి, క్యారెట్, నానబెట్టిన పల్లీలు ఇస్తున్నారు. రాత్రివేళల్లో శాఖాహార కూరలతోపాటు రసం, కోడిగుడ్డు, తమలపాకులు, అల్లం, తులసి ఆకులతో వేడి చేసిన నీటిని అందజేస్తున్నారు. బాధితులకు రోజూ మాస్క్లు పంపిణీ చేస్తున్నారు. హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వంటవార్పు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఐకేపీ, అంగన్వాడీ సిబ్బంది వైరస్పై అవగాహన కల్పిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. ఇటీవల కేంద్రాన్ని సందర్శించిన వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, ఎంపీడీవో ఎన్.వెంకటపతిరాజు, సర్పంచ్ మట్టూరి సత్యప్రసన్నాంభ, కార్యదర్శి హనుమంతరావు, గ్రామస్తుల కృషిని అభినందించారు.