ఏర్పాట్లు చేసిన పౌరసరఫరాల శాఖ
మెదక్ జిల్లాలో 9,525 టన్నులు
సిద్దిపేటలో 5,852 టన్నులు, సంగారెడ్డిలో 19,358 టన్నుల పంపిణీకి ఏర్పాట్లు
మెదక్/ సంగారెడ్డి, ఆగస్టు 2 : మెదక్ జిల్లాలో నూతన కార్డుదారులకు నేటి నుంచి రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం జూలై నెలలో జిల్లాలో నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేయగా.. ఈ నెల నుంచి వారికి ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నది.
నూతన కార్డుదారులకు 9,525 మెట్రిక్ టన్నులు..
జిల్లాలో నూతన కార్డుదారులు 3,368 మంది ఉండగా, వారికి ఆగస్టు నెలలో 9,525 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే అన్ని ఎంఎల్ఎస్ స్టాక్ పాయింట్లకు బియ్యం చేరుకున్నాయి. డీలర్లు సైతం బియ్యం పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. మంగళవారం నుంచి పంపిణీని ప్రారంభించనున్నారు.
మెదక్ జిల్లాలో మొత్తం 521 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఇందులో ఆహార భద్రతా కార్డులు 2,02,772 ఉండగా.. ఒకరికి 15 కిలోల బియ్యం, అంత్యోదయ కార్డులు 13,805 ఉండగా, 35 కిలోలు, అన్నపూర్ణ కార్డులు 75 ఉండగా.. 10 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా మున్సిపల్ ప్రాంతాల్లోని అంత్యోదయ కార్డులకు కిలో చక్కెర రూ.13.50, కిలో గోధుమలు రూ.7 అందజేయనున్నారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగరెడ్డి జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం మొత్తం 11,281 మంది దరఖాస్తు చేసుకోగా.. 8,139 మందిని అర్హులుగా గుర్తిస్తూ కార్డులను అందజేశారు. కొత్తగా జిల్లాలోని 845 చౌకధర దుకాణాల్లో 8,139 రేషన్కార్డులపై 19,358, 710 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నారు.
కొత్తకార్డులకు 10 కిలోలు
జిల్లాలో ఇటీవల అందజేసిన 3,368 నూతన కార్డుదారులకు ప్రతి మనిషికి 10కిలోల చొప్పున బియ్యం అందించనున్నారు. మంగళవారం నుంచి జిల్లాలోని 521 రేషన్ షాపుల్లో ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తారు. జిల్లాలో 2,02,772 ఆహార భద్రత కార్డుదారులకు ప్రతి మనిషికి 15 కిలోల చొప్పున.. 13,805 అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తాం. మున్సిపల్ ప్రాంతంలోని అంత్యోదయ కార్డులకు కిలో చక్కెర 13.50, కిలో గోధుమలు రూ.7 అందజేస్తాం.