జీలుగసాగుతో రైతులకు మేలు
రాయితీపై విత్తనాలు
దస్తురాబాద్, జూన్ 2: నేలల్లో పచ్చిరొట్టను వినియోగిస్తే భూసారం పెరగడంతో పాటు అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వరితో పాటు ఏ ఇతర పంటలు సాగు చేసిన ఎక్కువగా యూరియా, పొటాష్, భాస్వరం, నత్రజని, తదితర ఎరువులను వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్టను సాగు చేయడంతో పొలాల్లో సహజంగానే ఈ ఎరువులు ఉత్పత్తి అవుతాయి. భూసారం పెరగడంతో పాటు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. పిచ్చిరొట్ట మొత్తం 16 రకాల్లో లభిస్తుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. జీలుగ, జనుము, పెసర, వేరుశనగ, ఆవిశ, మినుము, కానుగ, వేప, జిల్లేడు, తంగేడు మొక్కలు సహజ సిద్ధమైన ఎరువులుగా ఉపయోగపడుతాయి. మండలంలో రైతులు ఎక్కువగా పచ్చిరొట్ట జీలుగను సాగు చేస్తారు.
65 శాతం రాయితీపై విత్తనాలు
రాష్ట్ర వ్యవసాయ శాఖ 65శాతం రాయితీపై ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు జీలుగ విత్తనాలను అందిస్తున్నది. దస్తురాబాద్ మండలంలో ఈ ఏడాది వానకాలం మొదటి విడుతగా 800 బస్తాలు (26 టన్నులు) వచ్చాయి. ఇవి కాకా ఇంకో 800 బస్తాలు, 200 కిలోల పెసర్లు రానున్నట్లు పీఏసీఎస్ చైర్మన్ రామడుగు శైలజ రమేశ్ రావు తెలిపారు. ప్రస్తుతం 665 జీలుగ విత్తనాల బస్తాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 30 కిలోల ఒక జీలుగ బస్తా రూ.1605 ఉండగా, రాయితీ రూ.1043 పోగా రైతులకు రూ.562కు అందిస్తున్నట్లు తెలిపారు.
జీలుగ సాగుతో ఉపయోగాలు…
భూమిలో నత్రజని, యూరియా శాతాన్ని పెంచుతుంది. భూసారాన్ని పెంచుతుంది. పంట దిగుబడులు పెరుగుతాయి. నేల చౌడు భారాన్ని తగ్గిస్తుంది. నేలలో సహజ సిద్ధమైన పోషకాలు అయినా నత్రజని, పొటాష్, భాస్వరం పంటకు అందేలా చేస్తుంది. సూక్ష్మ పోషకాలు జింక్, ఇనుము దాతువు, కాల్షియం వంటివి పంటకు లభిస్తుంది. జీలుగ పంట వేసిన రైతులు రసాయన ఎరువులు 30 నుంచి 40 శాతం వరకు తగ్గించుకోవచ్చు. దీంతో పంట పెట్టుబడి తగ్గుతుంది. అధిక దిగుబడికి భూసారాన్ని పెంచుతుంది.