15 సార్లు నీటి విడుదల చేసిన ఘనత టీఆర్ఎస్ సర్కారుదే
ఎంపీ బడుగుల, ఎమ్మెల్యే నోముల భగత్
పొట్టి చెల్మ సాగర్ ఎడమ కాల్వలకు నీటి విడుదల
హాలియా/తిరుమలగిరి(సాగర్), ఆగస్టు 1 : నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు వరుసగా 15వ సారి నీటి విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ సర్కారుదేనని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. ఆదివారం పొట్టిచెల్మ వద్ద కృష్ణమ్మకు పూజలు చేసి సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలను ప్రారంభించిన సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వానకాలం సీజన్కు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. సాగర్ ఎడమ కాల్వ ద్వారా 11లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. సాగర్ ప్రాజెక్టు చరిత్రలో వరుసగా 15 సార్లు నీటిని విడుదల చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. ఎడమ కాల్వ మేజర్లు, డిస్ట్రిబ్యూటరీల పరిధిలోని రైతులు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో సాగు నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కృష్ణానదిలో నీటి వాటాను దక్కించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని, ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేస్తున్నదన్నారు. సమైక్యాంధ్రలో తాగునీటికే తంటాలు పడితే, స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా రెండు పంటలకు సాగు నీరు అందిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈ ధర్మానాయక్, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మారెడ్డి, జటావత్ రవినాయక్, రావుల రాంబాబు యాదవ్, మంగ్తా నాయక్ పాల్గొన్నారు.