చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షించాలి
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): సుడా నిధులు రూ. 10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన సుడా సర్వసభ్య సమావేశానికి మంత్రితో పాటు ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, సుడా పరిధిలోని కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. కరీంనగర్కు నలువైపులా రహదారుల వద్ద స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన రహదారులను శుభ్రంగా ఉంచేందుకు రోడ్లు ఊడ్చే వాహనం కొనుగోలు చేయాలని సూచించారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, మానకొండూర్ చెరువు వద్ద సుందరీకరణ పనులు చేపట్టాలని కోరారు. మైలారం గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది, మానేరు జలాశయం నుంచి బోటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. అల్గునూర్ చౌరస్తా నుంచి మానకొండూర్ పోలీస్ స్టేషన్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, సుడా పరిధిలోని గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, కరీంనగర్ను మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
సుడా కార్యాలయంలో సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్తో పాటు ఏడుగురు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ, మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ సూచన మేరకు సంస్థ పరిధిలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎలగందుల కోట పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మానకొండూర్ చెరువు కట్ట, మైలారం గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మానకొండూర్ మండలం గట్టెపల్లిలో ప్రభుత్వ స్థలం అప్పగిస్తే ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తామని పేరొన్నారు. వరంగల్, హైదరాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల నుంచి కరీంనగర్కు వచ్చే రహదారుల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. సుడాలో ఉన్న రూ.15 కోట్ల నిధుల్లోంచి రూ.10 కోట్లు వెచ్చించి కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల్లో సుడా పరిధిలోకి వచ్చే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతామని వెల్లడించారు. సమావేశంలో మేయర్ వై సునీల్రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, సుడా వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, సుడా డైరెక్టర్లు మంద రమేశ్ గౌడ్, కామారం శ్యాం, శైలేందర్ యాదవ్, ఉదారపు మారుతి, రవీందర్ వర్మ, వంగర రవీందర్, సీహెచ్ శోభ, షేక్ యూసుఫ్, సుడా కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.