కరోనా వ్యాప్తి కట్టడికి పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలు
నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు
హాజీపూర్, ఏప్రిల్ 30 : కరోనా మహమ్మారి గతేడాది ప్రతి ఒక్కరినీ అతలాకుతలం చేసింది. తగ్గినట్లే తగ్గి ఈ ఏడాది మళ్లీ విజృంభించింది. రోజు రోజుకూ కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో హాజీపూర్ మండలంలో పలు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా ఇతరులను గ్రామంలోకి రానీయకుండా, గ్రామస్తులను అనవసరంగా బయటికి వెళ్లనీయకుండా చర్యలు తీసుకుంటున్నారు. మండలంలోని నర్సింగాపూర్, దొనబండ గ్రామాల్లో స్వీయ నిర్బంధం పాటిస్తున్నట్లు సర్పంచ్లు మట్టపల్లి మంజుల, జాడి సత్యం, గ్రామ పెద్దలు ప్రకటించారు. శుక్రవారం నంనూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కరోనా కట్టడికి తీర్మానించారు.
రోజురోజుకూ పెరుగుతున్న కేసులు
నర్సింగాపూర్లో కరోనా రెండో దశలో 14 కేసులు నమోదు కాగా, ఒక్కరు మృతి చెందారు. మిగతా వారు హోం క్వారంటైన్లో ఉన్నట్లు సర్పంచ్ తెలిపారు. దొనబండ గ్రామంలో ఇప్పటివరకు 30 పాజిటివ్ కేసులు నమోదు కాగా .. ఇద్దరు మృతి చెందారని, మిగతా వారు హోం క్వారంటైన్లో ఉన్నట్లు సర్పంచ్ తెలిపారు. నంనూర్ గ్రామ పంచాయతీలో కరోనా నివారణ కట్టడికి చర్యలు తీసుకునేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
పకడ్బందీగా లాక్డౌన్ అమలు..
నర్సింగాపూర్ గ్రామంలో అత్యవసరంగా గ్రామ సభను ఏర్పాటు చేసి గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, వ్యాపారులు, ప్రజలతో చర్చించి లాక్డౌన్ అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ లాక్డౌన్లో భాగంగా ప్రతి రోజూ మధ్యా హ్నం 12 గంటల తర్వాత దుకాణాలు, హోటళ్లు, బట్టల వ్యాపారులు, తదితర దుకాణాలు మూసివేసేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామస్తులు అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటికి రావాలని, అది కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు. లాక్డౌన్ చర్యలను చుట్టు పక్కల గ్రామాల్లోనూ అమ లు చేసేందుకు ఆలోచిస్తున్నారు.
కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకే..
కరోనా బారిన ప్రజలు పడకుండా, వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకే స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలు చేసేందుకు ప్రజా ప్రతి నిధులు, గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నాం. ఇంట్లో నుంచి బయటకు వస్తే తప్పని సరిగా మాస్క్ ధరించాల్సిందే. లేదంటే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించాం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గ్రామ పంచాయతీ పాలక వర్గం తీసుకున్న నిర్ణయానికి గ్రామస్తులు సహకరించాలి.
-మట్టనెల్లి మంజుల, నర్సింగాపూర్, సర్పంచ్